LIC: ఎల్‌ఐసీ చరిత్రలో తొలిసారి.. ప్రైవేటు వ్యక్తి నేతృత్వం?

ఎల్‌ఐసీకి ప్రస్తుతం ఛైర్మన్‌ హోదాలో ఉన్న వ్యక్తి నేతృత్వం వహిస్తున్నారు. ఆ స్థానంలో సీఈఓను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందట! పైగా ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తిని ఆ హోదాలో కూర్చోబెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

Published : 08 Dec 2022 18:01 IST

దిల్లీ: దిగ్గజ బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC)కి ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తిని సీఈఓగా నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సంస్థ ఆధునికీకరణలో భాగంగానే ఈ మార్పుపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో మదుపర్లలో విశ్వాసాన్ని నింపడానికీ ఈ చర్య దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సర్కార్‌ తలంపు కార్యరూపందాలిస్తే.. 66 ఏళ్ల చరిత్ర గల ఎల్‌ఐసీ (LIC)కి ప్రైవేటు వ్యక్తి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి అవుతుంది.

ఎల్‌ఐసీ (LIC) సీఈఓ పదవికి కావాల్సిన అర్హతలను విస్తృతం చేసేందుకు ప్రభుత్వం వివిధ వర్గాలతో సమాలోచనలు జరుపుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఫలితంగా ఎక్కువ మంది పదవి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎల్‌ఐసీకి ఛైర్మన్‌ హోదాలో ఉన్న వ్యక్తి నేతృత్వం వహిస్తున్నారు. తాజా ఛైర్మన్‌ ఎం.ఆర్‌.కుమార్‌ పదవీకాలం వచ్చే మార్చిలో ముగియనుంది. ఆ తర్వాత పూర్తిగా ఛైర్మన్‌ పదవినే రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సదరు అధికారులు తెలిపారు. ఆ స్థానంలో సీఈఓ పోస్టును సృష్టించి దాంట్లో ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తిని కూర్చొబెట్టాలన్నది ప్రణాళిక. దీనికి సంబంధించి ఎల్‌ఐసీ (LIC) చట్టంలో గత ఏడాదే మార్పులు చేసినట్లు నిపుణులు తెలిపారు.

అయితే ఏ రంగం నుంచి సీఈఓని ఎంపిక చేస్తారనే విషయం మాత్రం ఇంకా తెలియదు. ఎల్‌ఐసీ (LIC)కి నేతృత్వం వహించే వ్యక్తుల ఎంపికకు కావాల్సిన అర్హతలను మరింత విస్తృతపరచాల్సిన అవసరం ఉందని.. దీనికి తాను పదవిలో ఉండగానే అంగీకారం తెలిపినట్లు కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ తెలిపారు. దీనివల్ల సంస్థకు ఎలాంటి హాని ఉండదన్నారు. ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తిని నియమించాలని ప్రస్తుతానికి సూత్రప్రాయంగానే ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి చట్టంలో ఇంకా ఏమైనా మార్పులు చేయాల్సి వస్తుందేమోనని సర్కార్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే వేతనం విషయంలోనూ ప్రైవేటుకు దీటుగా ఇవ్వగలమా.. లేదా.. అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రభుత్వ రంగంతో పోలిస్తే ప్రైవేటు రంగంలో ఉన్నతస్థాయి ఉద్యోగులకు అధిక వేతనాలు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని