Household debt: కుటుంబాల పొదుపులు సగానికి తగ్గాయ్‌.. అప్పులు రెండింతలు పెరిగాయ్‌!

Household debt: ప్రజలు తమ పొదుపులను వివిధ ఆర్థిక సాధనాల్లోకి పెట్టుబడులుగా మళ్లిస్తున్నారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు

Updated : 21 Sep 2023 18:24 IST

ముంబయి: దేశంలో కుటుంబాల నికర ఆర్థిక పొదుపులు (Household Savings) 2022- 23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. ఫలితంగా దేశ స్థూల దేశీయోత్పత్తిలో పొదుపుల వాటా 5.1 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. మరోవైపు కుటుంబాల అప్పుల (Household Debt) భారం 2020-21 నుంచి రెండింతలు పెరిగి 15.6 లక్షల కోట్లకు చేరినట్లు పేర్కొంది. ప్రాథమికంగా బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నట్లు గుర్తించింది.

కుటుంబాల పొదుపులు తగ్గి, అప్పులు పెరగడంపై వివిధ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. స్థూలంగా దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలంగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వాటిని కొట్టిపారేశారు. ప్రజలు తమ పొదుపులను వివిధ ఆర్థిక సాధనాల్లోకి పెట్టుబడులుగా మళ్లిస్తున్నారని తెలిపారు. గణాంకాలు గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఎలాంటి సంక్షోభం లేదని స్పష్టం చేశారు.

ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదికలోని కీలకాంశాలు..

  • పొదుపుల నుంచి అత్యధిక నిధులు ఆస్తుల కొనుగోళ్లలోకి మళ్లాయి. పెరిగిన రూ.8.2 లక్షల కోట్ల అప్పుల్లో దాదాపు రూ.7.1 లక్షల కోట్లు బ్యాంకు రుణాలే. వీటిలో గృహ రుణాల వాటా అధికం.
  • బీమా, ప్రావిడెంట్‌ ఫండ్‌, పెన్షనల్‌ ఫండ్లలో కుటుంబాల పెట్టుబడులు రూ.4.1 లక్షల కోట్ల మేర పెరిగాయి.
  • గత రెండేళ్లలో బ్యాంకుల నుంచి కుటుంబాలు తీసుకున్న రిటైల్‌ రుణాల్లో 55 శాతం ఇళ్లు, విద్య, వాహనాల కొనుగోళ్లకు వెళ్లాయి. తక్కువ వడ్డీరేట్ల కారణంగానే రిటైల్‌ రుణాల మంజూరు పెరిగింది.
  • 2011-12లో కుటుంబాల పొదుపుల్లో దాదాపు మూడొంతులు ఆస్తుల్లోనే ఉండేవి. 2020-21 నాటికి అది 48 శాతానికి తగ్గింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రెండ్‌ మారుతోంది. ప్రజలు తిరిగి ఆస్తులపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది ముగిసే నాటికి వీటిలో పొదుపుల వాటా 70 శాతానికి చేరే అవకాశం ఉంది. స్థిరాస్తి రంగం పుంజుకుంటోందనడానికి ఇదొక నిదర్శనం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని