Stock Market: ఎగ్జిట్‌ పోల్స్‌ జోష్‌.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Stock Market: శనివారం వెలువడ్డ ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్‌డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో జోష్‌ నింపాయి.

Updated : 03 Jun 2024 09:44 IST

Stock Market Opening bell | ముంబయి: అంతా ఊహించినట్లుగానే దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఏకంగా 2,000 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. నిఫ్టీ ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా పుంజుకుంది. ఎన్‌డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు సూచీల్లో జోష్‌ నింపాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలూ దన్నుగా నిలుస్తున్నాయి. రూపాయి బలపడడం; బ్యాంకింగ్‌, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు రాణించడం కలిసొస్తోంది.

ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,808 పాయింట్ల లాభంతో 75,769 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 613 పాయింట్లు లాభపడి 23,144 దగ్గర కొనసాగుతోంది. అంతకుముందు సెన్సెక్స్‌ 76,738.89 దగ్గర, నిఫ్టీ 23,338.70 వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో అన్ని షేర్లూ లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఎల్‌ అండ్‌ టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గతవారాన్ని లాభాలతో ముగించాయి. రేట్ల కోత ఆశలతో నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు రాణిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 81.06 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) శుక్రవారం నికరంగా రూ.1,614 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ.2,115 కోట్ల వాటాలను కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని