Indian Economy: రాబోయే కొన్నేళ్లలో 10 ట్రిలియన్‌ డాలర్ల భారత్‌: WEF అధ్యక్షుడు

Indian Economy: భారత్‌లో మరెక్కడా కనిపించని ఆశావహ దృక్పథం కనిపిస్తోందని డబ్ల్యూఈఎఫ్‌ అధ్యక్షుడు బోర్గే బ్రెండే తెలిపారు. మరికొన్నేళ్లలో ఈ దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేశారు.

Published : 22 Feb 2024 15:14 IST

దిల్లీ: రాబోయే కొన్నేళ్లలో భారత్‌ 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా (Indian Economy) అవతరిస్తుందని ‘ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)’ అధ్యక్షుడు బోర్గే బ్రెండే అంచనా వేశారు. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానానికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌లో ఉన్న ఆశావహ దృక్పథం ప్రస్తుతానికి ప్రపంచంలో మరెక్కడా కనిపించడం లేదని గురువారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

సమయం వచ్చినప్పుడు భారత ప్రభుత్వ సహకారంతో డబ్ల్యూఈఎఫ్‌ ఇండియా సమ్మిట్‌ ద్వారా తిరిగి దేశానికి రావాలనుకుంటున్నట్లు బ్రెండే తెలిపారు. ఏటా జనవరిలో దావోస్‌ కేంద్రంగా జరిగే డబ్ల్యూఈఎఫ్‌ (WEF) సమావేశానికి ప్రధాని మోదీకి (PM Modi) ఎప్పటికీ ఆహ్వానం ఉంటుందని తెలిపారు. భారత్‌ కొన్నేళ్లపాటు ఏడు శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేశారు. గతకొంతకాలంగా దేశంలో కీలక సంస్కరణలు చోటుచేసుకున్నాయని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) సైతం ఊపందుకున్నాయని పేర్కొన్నారు. తయారీ కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు.

ప్రపంచవ్యాప్తంగా నేడు సంప్రదాయ పద్ధతిలో కంటే డిజిటల్ వాణిజ్యమే వేగంగా విస్తరిస్తోందని బ్రెండే తెలిపారు. ఈ తరుణంలో డిజిటల్‌ రంగంలో భారత్‌ సాధిస్తున్న పురోగతిని కొనియాడారు. మరోవైపు వచ్చే కొన్నేళ్లలో అంతర్జాతీయ వేదికలపై దౌత్యపరంగా భారత్‌ తనదైన పాత్ర పోషిస్తుందన్నారు. చాలా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం నుంచి భారత్‌ దూరంగా ఉండగలిగిందన్నారు. పొరుగు దేశాలతో సవాళ్లు ఎదురైనప్పటికీ.. వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగిందని తెలిపారు.

ఐదేళ్ల పాటు ఆరు శాతం వృద్ధి: జెఫరీస్‌

భారత్‌ 2027 నాటికి ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా (Indian Economy) అవతరిస్తుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ కంపెనీ జెఫరీస్‌ అంచనా వేసింది. తద్వారా జర్మనీ, జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. 2030 నాటికి పది ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్‌ను విస్మరించడం సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడింది. జీఎస్టీ అమలు, దివాలా స్మృతి చట్టం, రెరా, నోట్ల రద్దు వంటి కీలక సంస్కరణల ప్రభావం ఉన్నప్పటికీ.. భారత జీడీపీ వృద్ధి పథంలో సాగిందని వివరించింది.

వచ్చే ఐదేళ్ల పాటు భారత్‌ ఆరు శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తుందని జెఫరీస్‌ తెలిపింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధి క్షీణించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు వచ్చే ఐదు నుంచి ఏడేళ్ల పాటు 8-10 శాతం రాబడినిస్తాయని అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు