Kalanithi Maran vs SpiceJet: మేమే స్పైస్‌జెట్‌ నుంచి ₹1,323 కోట్లు కోరతాం: కళానిధి మారన్‌

స్పైస్‌జెట్‌, ఆ సంస్థ ప్రమోటర్‌ అజయ్‌సింగ్‌ నుంచి రూ.1,323 కోట్లు కోరనున్నట్లు కళానిధి మారన్‌ వెల్లడించారు.

Published : 27 May 2024 18:52 IST

దిల్లీ: స్పైస్‌జెట్‌ విషయంలో ఇటీవల దిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పుపై ఆ సంస్థ మాజీ ప్రమోటర్‌ కళానిధి మారన్‌ (kalanithi maran) స్పందించారు. ఈ తీర్పును సవాల్‌ చేయనున్నామని తెలిపారు. అలాగే, తమకు జరిగిన నష్టానికి గానూ స్పైస్‌జెట్‌ నుంచి రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్నట్లు తెలిపారు. మారన్‌ నుంచి రూ.450 కోట్లు పరిహారం కోరతామని స్పైస్‌జెట్‌ వెల్లడించిన నేపథ్యంలో మారన్‌, ఆయన కంపెనీ కేఏఎల్‌ ఎయిర్‌వేస్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

కళానిధి మారన్‌కు రూ.579 కోట్లను వడ్డీతో పాటు చెల్లించాలని స్పైస్‌జెట్, ప్రస్తుత ప్రమోటరు అజయ్‌సింగ్‌కు గతంలో జారీ చేసిన మధ్యవర్తిత్వ ఆదేశాలను సమర్థించిన ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈనెల 17న దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పక్కనపెట్టింది. దీంతో కళానిధి మారన్, ఆయన సంస్థ కేఏఎల్‌ ఎయిర్‌వేస్‌కు చెల్లించిన రూ.730 కోట్ల మొత్తం నుంచి రూ.450 కోట్ల రిఫండ్‌ కోరనున్నట్లు స్పైస్‌జెట్‌ ఇటీవల తెలిపింది.

దీనిపై మారన్‌ స్పందించారు. తమ మధ్య ఉన్న వివాదంపై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు తెలిపారు. న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోనున్నామని తెలిపారు. అలాగే, ఎఫ్‌టీఐ కన్సల్టింగ్‌ ఎల్‌ఎల్‌పీ నిర్ణయించిన రూ.1323 కోట్ల నష్టాన్ని సైతం స్పైస్‌జెట్‌ నుంచి కోరనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా తమకు అనుకూలంగా వెలువడిందని గుర్తు చేశారు. 

గతంలో స్పైస్‌జెట్‌కు ప్రమోటర్‌గా వ్యవహరించిన కళానిధి మారన్‌.. తనకున్న 58.46 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్‌ అజయ్‌సింగ్‌కు బదిలీ చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా తనకు వారంట్స్‌, షేర్లు జారీ చేయలేదని మారన్‌ ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం కోర్టుకెళ్లింది. దీనిపై మధ్యవర్తిత్వ కోర్టు, దిల్లీ సింగిల్‌ బెంచ్‌ తీర్పులను అనుసరించిన స్పైస్‌జెట్‌.. మారన్‌, ఆయనకు చెందిన కాల్ ఎయిర్‌వేస్‌కు రూ.580 కోట్లు అసలు, రూ.150 కోట్లు వడ్డీ చొప్పున రూ.730 కోట్లు చెల్లించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని