Kotak Mahindra Bank: కోటక్‌ బ్యాంకు షేరు ఢమాల్‌.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!

Kotak Mahindra Bank: ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి.

Published : 25 Apr 2024 12:47 IST

ముంబయి: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌పై (Kotak Mahindra Bank) ఆర్‌బీఐ ఆంక్షల కొరడా నేపథ్యంలో సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. గురువారం ఓ దశలో 13 శాతం మేర నష్టపోయి రూ.1,602 వద్ద 52 వారాల కనిష్ఠానికి చేరాయి. ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ.37,500 కోట్లు తగ్గింది.

ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌పై (Kotak Mahindra Bank) ఆర్‌బీఐ చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా కొత్త ఖాతాదార్లను జతచేసుకోవడంపై నిషేధం విధించింది. తాజాగా క్రెడిట్‌ కార్డులనూ జారీ చేయకూడదని ఆజ్ఞాపించింది. తమ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్‌బీఐతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని.. సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించుకుంటామని బ్యాంక్ వెల్లడించింది.

యాక్సిస్‌ బ్యాంక్ షేరు విలువ గురువారం ఐదు శాతం పెరిగి రూ.1,120 వద్ద గరిష్ఠానికి చేరింది. అదే సమయంలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (Kotak Mahindra Bank) షేర్లు కుంగడంతో.. మార్కెట్‌ క్యాప్‌ పరంగా యాక్సిస్‌ బ్యాంక్‌ దాన్ని అధిగమించింది. ప్రస్తుతం రూ.3.4 లక్షల కోట్లతో నాలుగో అతిపెద్ద మార్కెట్‌ క్యాప్‌ ఉన్న బ్యాంక్‌గా నిలిచింది. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఐదో స్థానానికి పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని