Mumbai: ఆసియాలో కుబేరుల ‘రాజధాని’ ముంబయి.. బీజింగ్‌ను అధిగమించి టాప్‌లోకి

Mumbai emerged as Asia billionaire capital: ఆసియాలో బిలియనీర్ల కేంద్రంగా ముంబయి అవతరించింది. బీజింగ్‌ను దాటి అత్యధిక మంది సంపన్నులు ఉన్న నగరంగా నిలిచింది.

Updated : 26 Mar 2024 14:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ వాణిజ్య రాజధాని ముంబయి (Mumbai) మరో గుర్తింపు సాధించింది. ఆసియాలోనే అత్యధిక మంది కుబేరులకు నిలయంగా నిలిచింది. చైనా రాజధాని బీజింగ్‌ (Beijing)ను అధిగమించి తొలిసారి ఈ ప్రాంత బిలియనీర్‌ క్యాపిటల్‌ (Billionaire capital)గా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ మేరకు హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ (Hurun Global) నివేదిక వెల్లడించింది. 

ఈ ఏడాదికిగానూ అత్యధిక మంది శ్రీమంతులు నివాసముంటున్న నగరాల జాబితాను హురున్‌ తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. 92 మంది బిలియనీర్లతో ముంబయి తొలి స్థానంలో నిలిచింది. 91 మందితో బీజింగ్‌ రెండో స్థానానికి పడిపోయింది. గత ఏడాది కాలంలో ముంబయిలో కొత్తగా 26 మంది సంపన్నుల క్లబ్‌లో చేరగా.. బీజింగ్‌ 18 మందిని ఈ జాబితా నుంచి కోల్పోయింది.

ట్రంప్‌నకు మళ్లీమళ్లీ రాని రోజు.. ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం..!

ప్రపంచంలోనే అత్యంత వేగంగా బిలియనీర్‌ క్యాపిటల్‌గా ఎదిగిన నగరం ముంబయి అని నివేదిక వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కుబేరులున్న నగరాల జాబితాలో ఇది మూడో స్థానంలో నిలిచిందని తెలిపింది. ఈ లిస్ట్‌లో న్యూయార్క్‌ (119 మంది) అగ్ర స్థానంలో ఉండగా.. లండన్‌ (97) రెండో స్థానం దక్కించుకుంది. మన దేశ రాజధాని దిల్లీ తొలిసారి టాప్‌ 10లో చోటు సాధించింది.

అయితే, దేశాల వారీగా చైనా (China)నే ఈ జాబితా టాప్‌లో ఉంది. గత ఏడాది కాలంలో అక్కడ 155 మంది కోటీశ్వరులు తమ సంపదను భారీగా కోల్పోయినా.. 814 మంది బిలియనీర్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అమెరికా 800 మందితో రెండో స్థానం దక్కించుకుంది. ఏడాది క్రితం అగ్రరాజ్యంలో కొత్తగా 109 మంది రిచ్‌ క్లబ్‌లో చేరారు. ఇక 271 మందితో భారత్‌ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని