Stock market: స్వల్ప లాభాల్లో సూచీలు.. ఫెడ్‌ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 89 పాయింట్లు, నిఫ్టీ 21 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 20 Mar 2024 15:58 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ స్వల్ప లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో ఏకంగా 700 పాయింట్ల మేర చలించింది. మరోవైపు వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్‌ నిర్ణయం ఈ రాత్రికి వెలువడనుంది. దీంతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఫెడ్‌ నిర్ణయాలు రేపటి మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం 72,036.86 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఇంట్రాడేలో 71,674.42-72,402.67 మధ్య కదలాడింది. చివరికి 89.64 పాయింట్ల లాభంతో 72,101.69 వద్ద ముగిసింది. నిఫ్టీ 21.65 పాయింట్ల లాభంతో 21,839.10 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.17గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎస్‌బీఐ, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 86.79 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,156 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని