Stock market: ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు సూచీలు.. 351 పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌

Stock market: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 350 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 04 Apr 2024 16:07 IST

Stock market | ముంబయి: దేశీయ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన సూచీలు సరికొత్త రికార్డులను తిరగరాశాయి. కొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని అందుకున్నాయి. గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఓ మోస్తరు లాభాలకు పరిమితమయ్యాయి. సెన్సెక్స్‌ 351 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,500 ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ 74,413.82 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కాసేపు ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత మళ్లీ లాభాల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో 74,501.73 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను అందుకుంది. చివరికి 350.81 పాయింట్ల లాభంతో 74,227.63 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 80 పాయింట్లు లాభపడి 22,514.65 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.44గా ఉంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటాన్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ రకం చమురు బ్యారెల్‌ ధర 89.32 డాలర్లు, ఔన్సు బంగారం ధర 2,312.60 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని