Stock market: బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 25 Apr 2024 16:01 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా ఐదో రోజూ రాణించాయి. ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో స్దబ్దుగా ప్రారంభమైన మన మార్కెట్లు.. మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ స్టాక్స్‌ కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. యాక్సిస్‌ బ్యాంక్‌, స్టేట్‌బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి స్టాక్స్‌ సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో ఓ దశలో సెన్సెక్స్‌ 700 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ 22,600 స్థాయిని దాటింది.

సెన్సెక్స్‌ ఉదయం 73,572.34 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,556.15 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. తర్వాత 74,571.25 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 486.50 పాయింట్ల లాభంతో 74,339.44 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 167 పాయింట్ల లాభంతో 22,570.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.32గా ఉంది. సెన్సెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్‌, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, నెస్లే ఇండియా, ఐటీసీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (10శాతం), హెచ్‌యూఎల్‌, టైటాన్‌, బజాజ్‌ఫైనాన్స్, మారుతీ సుజుకీ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర 88 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని