Stock market: ఐదోరోజూ నష్టాల్లోనే సూచీలు.. 74వేల దిగువకు

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 617 పాయింట్లు, నిఫ్టీ 216 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Published : 30 May 2024 16:04 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సమీపిస్తుండటంతో మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపడం ఇందుకు కారణం. దీంతో సూచీలు వరుసగా ఐదో రోజూ నష్టపోయాయి. సెన్సెక్స్‌ 74 వేల దిగువకు, నిఫ్టీ 22,500 దిగువకు చేరాయి.

సెన్సెక్స్‌ ఉదయం 74,365.88 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 74,502.90) నష్టాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 73,668.73 పాయిట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 617.30 పాయింట్ల నష్టంతో 73,885.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 216.30 పాయింట్లు కోల్పోయి 22,488.65 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.31గా ఉంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎల్‌అండ్‌టీ షేర్లు రాణించడం గమనార్హం. టాటా స్టీల్‌, టైటాన్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ చమురు ధర 83.20 డాలర్లుగా ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2,330 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని