Stock Market: సూచీల్లో ఎన్నికల ఫలితాల జోష్‌.. 20,500 పైకి నిఫ్టీ

Stock Market Opening bell | ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 825 పాయింట్ల లాభంతో 68,306 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 248 పాయింట్లు పెరిగి 20,516 దగ్గర సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది.

Published : 04 Dec 2023 09:35 IST

Stock Market Opening bell | అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో పాటు తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 825 పాయింట్ల లాభంతో 68,306 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 248 పాయింట్లు పెరిగి 20,516 దగ్గర సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.29 దగ్గర ప్రారంభమైంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉండడం గమనార్హం. ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు ఒక శాతానికి పైగా లాభంతో ట్రేడవుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) శుక్రవారం లాభాలతో ముగిశాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి వడ్డీరేట్ల కోత ఉండొచ్చనే సంకేతాలు అక్కడి సూచీలకు కలిసొచ్చాయి. ఆసియా పసిఫిక్‌ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) శుక్రవారం రూ.1,589 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు (DII) సైతం రూ.1,448 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

దేశీయంగా చూస్తే.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాలను భాజపా గెలవడం సూచీలపై సానుకూల ప్రభావం చూపుతోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ నిర్ణయాలు ఈనెల 8న వెలువడతాయి. వడ్డీ రేట్లలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పు చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ.. ద్రవ్య నిర్వహణ, రుణాల వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఆర్‌బీఐ గవర్నర్‌ చేసే వ్యాఖ్యలు కీలకం అవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు