Stock Market: మూడోరోజూ నష్టాలే.. 18,150 దిగువకు నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 128.90 పాయింట్ల నష్టంతో 61,431.74 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 51.80 పాయింట్లు నష్టపోయి 18,129.95 దగ్గర ముగిసింది.

Updated : 18 May 2023 16:28 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లకు గరిష్ఠాల వద్ద అమ్మకాల సెగ తగిలింది. స్థిరాస్తి, విద్యుత్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు ఈరోజు వెలువడ్డ పలు కంపెనీల మార్చి త్రైమాసిక ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. సూచీల్లో ప్రాధాన్య వెయిటేజీ ఉన్న ఎస్‌బీఐ, ఐటీసీ ఫలితాలు వెలువడ్డ తర్వాత మార్కెట్లు మరింత కిందుకు వెళ్లాయి.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 61,937.86 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 61,349.34 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 128.90 పాయింట్ల నష్టంతో 61,431.74 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,287.50 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,104.85 దగ్గర కనిష్ఠానికి చేరింది. చివరకు 51.80 పాయింట్లు నష్టపోయి 18,129.95 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 22 పైసలు పతనమై 82.59 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, విప్రో షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, ఐటీసీ, టైటన్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, ఎల్అండ్‌టీ, టాటా మోటార్స్‌, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో స్టాక్‌ విలువ ఈరోజు 2.05 శాతం నష్టపోయి రూ.418.85 దగ్గర స్థిరపడింది. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 7 శాతం పుంజుకొని రూ.19,058 కోట్లకు చేరింది. నికర లాభం 23 శాతం పెరిగి రూ.5,175 కోట్లకు ఎగబాకింది.

ఎస్‌బీఐ షేరు ఈరోజు 1.70 శాతం నష్టపోయి రూ.576.35 వద్ద ముగిసింది. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను బ్యాంకు ఈరోజు ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం 83 శాతం పెరిగి రూ.16,694.51కు చేరింది.     

నిన్న వెలువడ్డ జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ త్రైమాసిక ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. దీంతో కంపెనీ షేరు ఈరోజు 1.27 శాతం నష్టపోయి రూ.475 దగ్గర స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని