Elon Musk: ఎలాన్‌ మస్క్‌పై ట్విటర్‌ మాజీ ఉన్నతోద్యోగుల దావా

Elon Musk: ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్‌ మస్క్‌ అనేక మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. వారిలో సీఈఓ, సీఎఫ్‌ఓ వంటి ఉన్నత పదవుల్లో ఉన్నవారూ ఉన్నారు. వారంతా తాజాగా కోర్టును ఆశ్రయించారు.

Updated : 05 Mar 2024 15:15 IST

Elon Musk | వాషింగ్టన్‌: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ‘ఎక్స్‌’తో పాటు దాని అధిపతి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)పై కంపెనీ మాజీ ఉన్నతోద్యోగులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. తమకు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉందని కోర్టులో దావా వేశారు. తమ బకాయిలను ఎగ్గొట్టడానికి మస్క్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ట్విటర్‌ (ప్రస్తుతం ‘ఎక్స్‌’)ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్‌ (Elon Musk) పలువురు ఉన్నతోద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఒక ఏడాది వేతనంతో పాటు తమకిచ్చిన స్టాక్‌ అవార్డులకు విలువ కట్టి ఇవ్వాల్సి ఉందని దావాలో పేర్కొన్నారు. ఆ లెక్కన మొత్తం 128 మిలియన్‌ డాలర్లు రావాల్సి ఉందని వెల్లడించారు. కోర్టును ఆశ్రయించిన వారిలో మాజీలైన ట్విటర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌, సీఎఫ్‌ఓ నెడ్‌ సెగల్‌, చీఫ్‌ లీగల్‌ కౌన్సెల్‌ విజయ గద్దె, జనరల్‌ కౌన్సెల్‌ సీన్‌ ఎడ్జెట్‌ ఉన్నారు.

తమకు పరిహారం చెల్లించే ఉద్దేశం మస్క్‌కు లేదని దావాలో పేర్కొన్నారు. అందుకే తమ తొలగింపులకు ‘నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తన’ వంటి అసంబద్ధ కారణాలు చూపారని ఆరోపించారు. ఆ స్థానాల్లో ఇతర కంపెనీల్లోని ఉద్యోగులను నియమించారని చెప్పారు. ఇలా చేయడం మస్క్‌ నైజమని విమర్శించారు. ట్విటర్‌ నుంచి ఉద్వాసనకు గురైన చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

మస్క్‌ నేతృత్వంలో ట్విటర్‌ అపహాస్యం పాలవుతోందని కాలిఫోర్నియా నార్తర్న్‌ డిస్ట్రిక్ట్‌ ఫెడరల్‌ కోర్టులో దాఖలు చేసిన దావాలో అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు, కార్యాలయాలను అద్దెకిచ్చిన యజమానులు, విక్రేతలు సహా కంపెనీ నిర్వహణకు సహకరించే అందరిపై మస్క్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తారని ఆరోపించారు. బిల్లులు కూడా చెల్లించరని తెలిపారు. నియమాలు తనకు వర్తించవని భావిస్తారని చెప్పారు. ఆయనతో విభేదించిన వారిని తన సంపద, పరపతితో అణగదొక్కే ప్రయత్నం చేస్తారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

2022 అక్టోబర్‌లో ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అందుకోసం ఆయన ఒక్కో స్టాక్‌కు 54.20 డాలర్ల చొప్పున 44 బిలియన్‌ డాలర్లు చెల్లించారు. ఆ తర్వాత ఈ సామాజిక మాధ్యమ సంస్థలో అనేక మార్పులు చేశారు. దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. సంస్థ పేరును ట్విటర్‌ నుంచి ‘ఎక్స్‌’గా మార్చారు. కంటెంట్‌ మోడరేషన్‌లోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని