Weight Loss: రెండేళ్లలో 151 నుంచి 80 కిలోలకు.. కంపెనీ సీఈఓ ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ

Dhruv Agarwala weight loss journey: ఏకంగా 80 కిలోలు తగ్గడమంటే కష్టమే కదా. కానీ, హౌసింగ్‌.కామ్‌ సీఈఓ దాన్ని నిజం చేసి చూపించారు. దానికోసం ఆయన ఏం చేశారో చూద్దాం..!

Published : 27 Mar 2024 13:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బరువు తగ్గాలని ఎవరికి మాత్రం ఉండదు? ఆరోగ్యం, ఫిట్‌నెస్‌.. కారణమేదైనా చాలామంది ఇటీవల దీనిపై దృష్టి పెడుతున్నారు. ఆహారం, చేసే వ్యాయామాల విషయంలో కచ్చితమైన నియమాలు పాటిస్తున్నారు. కానీ, కొందరు ఫలితం వచ్చే వరకు కఠినమైన జీవనశైలిని అవలంబించలేక మధ్యలోనే నిష్క్రమిస్తుంటారు. అలాంటి వారికి ప్రముఖ స్థిరాస్తి సంస్థ హౌసింగ్‌.కామ్‌ సీఈఓ ధ్రువ్‌ అగర్వాల్‌ స్టోరీ స్ఫూర్తిమంతంగా నిలుస్తోంది. రెండేళ్లలో 71 కిలోలు తగ్గిన ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారు.

వ్యాపారరీత్యా సింగపూర్‌లో నివాసముంటున్న ధ్రువ్‌ అగర్వాల్‌ 2021లో ఓ పనిమీద భారత్‌కు వచ్చారు. ఆ సమయంలోనే ఆయనకు ఛాతీలో నొప్పిగా అనిపించింది. గుండెపోటు అనుకొని వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. ఇక చనిపోతాననే అనుకున్నారట. కానీ, అసిడిటీ వల్ల వచ్చిన సమస్య అని తెలుసుకొని ఊరట చెందారు. ఆ సంఘటనే తనని మేల్కొల్పిందని ఇటీవల ‘సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆరోగ్యాన్ని నియంత్రణలో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో అప్పుడే తెలిసొచ్చిందంటూ తన వెయిట్‌ లాస్‌ జర్నీని (Dhruv Agarwala weight loss journey) పంచుకున్నారు.

  • కోల్‌కతాలో పుట్టి పెరిగిన ధ్రువ్‌ ఆటల్లో చురుగ్గా ఉండేవారు. కెరీర్‌లో స్థిరపడే క్రమంలో అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల బరువు పెరిగారు. వారంలో మూడు స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ సెషన్‌లతో బరువు తగ్గే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కొంత కాలం తర్వాత వాకింగ్‌, హైకింగ్‌ ప్రారంభించారు. టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ ఫిట్‌నెస్‌ను స్ఫూర్తిగా తీసుకొని కృషి చేసినట్లు ధ్రువ్‌ వెల్లడించారు.
  • ఈ క్రమంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. మోటివేషన్‌ కోల్పోయారు. బరువు తగ్గడం వల్ల ఉండే ప్రయోజనాలను తలచుకొని తిరిగి రీఛార్జ్‌ అయ్యేవారు. సవాల్‌గా స్వీకరించి ఆహార నియమాల్లో మార్పులు చేసుకున్నారు. ముందు పరిమాణాన్ని తగ్గించారు. తర్వాత క్రమంగా పౌష్టికాహారంపై దృష్టి సారించారు. రోజుకు 1,700 కెలోరీలకే పరిమితమయ్యారు. ప్రాసెస్డ్‌ ఫుడ్‌, వేపుళ్ల స్థానంలో అధిక ప్రోటీన్‌ ఉండే ఆహారం, చిరుతిళ్లను స్వీకరించారు. కార్బోహైడ్రేట్లను తగ్గించారు. దాదాపు 18నెలల పాటు ఆల్కహాల్‌కు పూర్తి దూరంగా ఉన్నారు.
  • వ్యాయామం, ఆహార నియమాలతో పాటు ధ్రువ్‌ ఉక్కు సంకల్పం కూడా జతవ్వటంతో ఫలితాలొచ్చాయి. ఆ స్ఫూర్తితో మరింత ఫిట్‌నెస్‌ కోసం రన్నింగ్‌, స్విమ్మింగ్‌ మొదలుపెట్టారు. తన సతీమణి ఉపాసన సహకారంతో ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ అనుకున్న ఫలితాన్ని సాధించానని ధ్రువ్‌ వివరించారు.
  • దీంతో 2021లో 151.7 కిలోలున్న ఆయన 2023 ఫిబ్రవరి నాటికి 80.6 కిలోలకు తగ్గారు. అధిక బరువుతో ఉన్నప్పుడు తనలో ప్రీడయాబెటిక్‌ లక్షణాలు ఉండేవని ధ్రువ్‌ తెలిపారు. అధిక కొలెస్ట్రాల్‌, బీపీ వల్ల దాదాపు నాలుగేళ్ల పాటు ఔషధాలు వాడినట్లు చెప్పారు. పైగా ‘స్లీప్‌ ఆప్నియా’తోనూ బాధపడినట్లు వెల్లడించారు. కానీ, ఇప్పుడు ఆ సమస్యలేవీ లేవని ధీమాగా చెప్పారు.

ఎవరీ ధ్రువ్‌ అగర్వాల్‌..

హౌసింగ్‌.కామ్‌, మకాన్‌.కామ్‌, ప్రాప్‌టైగర్‌.కామ్‌ వంటి డిజిటల్‌ స్థిరాస్తి వేదికలను నిర్వహిస్తున్న రియా ఇండియా సీఈఓ ధ్రువ్‌ అగర్వాల్‌. ఇల్లు కొనేవారికి భారత్‌లో ఈ సంస్థ సమగ్ర సేవలను అందిస్తోంది. టెక్‌ ఆధారిత స్థిరాస్తి వ్యాపారాల్లో తనదైన ముద్రవేసిన ధ్రువ్‌.. విద్య, మైనింగ్‌, ఫిన్‌టెక్‌ రంగంలోనూ పలు సంస్థలను ప్రారంభించారు. దేశంలో ఇళ్లు కొనే ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో 2011లో ప్రాప్‌టైగర్‌.కామ్‌ను స్థాపించారు. అనంతరం హౌసింగ్‌.కామ్‌, మకాన్‌.కామ్‌ను సొంతం చేసుకున్నారు.

అంతకు ముందు జనరల్‌ ఎలక్ట్రిక్‌ ఇన్‌ఫ్రా బిజినెస్‌ ఇండియా సీఈఓగా ధ్రువ్‌ పనిచేశారు. ‘ఐట్రస్ట్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌’తో తన సొంత వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. తర్వాత దాన్ని కార్వీ కొనుగోలు చేసింది. నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ నుంచి మెటీరియల్‌ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న ధ్రువ్‌.. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని