X Value: ‘ఎక్స్‌’ విలువ 19 బి.డాలర్లే.. మస్క్‌ చెల్లించిన దానిలో సగం కంటే తక్కువ!

X Value: ‘ఎక్స్‌’ను ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. దాని విలువ ఇప్పుడు కేవలం 19 బి.డాలర్లే ఉంటుందని స్వయంగా కంపెనీయే లెక్క గట్టింది.

Published : 31 Oct 2023 11:45 IST

X Value | వాషింగ్టన్‌: సామాజిక మాధ్యమ దిగ్గజం ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్‌) (Social Media X) సోమవారం తమ ఉద్యోగులకు స్టాక్‌ గ్రాంట్స్‌ను జారీ చేసింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా జారీ చేసిన స్టాక్ గ్రాంట్స్‌ ప్రకారం కంపెనీ విలువ (X Value) కేవలం 19 బిలియన్‌ డాలర్లు మాత్రమే. బిలియనీర్ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) దీన్ని గత ఏడాది 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అంటే ఎక్స్‌ విలువ (X Value) దాదాపు సగానికి పైగా పడిపోయిందన్నమాట!

ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఒక్కో ట్విటర్‌ స్టాక్‌కు 54.20 డాలర్ల చొప్పున చెల్లించారు. తాను కంపెనీకి దాని విలువ కంటే అధికంగా చెల్లించానని ఆయన మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. మార్చిలో కంపెనీ ఉద్యోగులకు లేఖ రాస్తూ ఎక్స్‌ విలువ 20 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉంటుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ధ్రువీకరించినట్లయింది. స్టాక్‌ గ్రాంట్స్‌ విలువను కంపెనీ బోర్డు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తుంది. ఈ లెక్కన ఒక్కో షేరు విలువను 45 డాలర్లుగా లెక్కగట్టి ఉద్యోగులకు గ్రాంట్స్‌ జారీ చేసింది. అంటే తమ కంపెనీ విలువ 19 బిలియన్‌ డాలర్లే అని స్వయంగా వారే అంగీకరించినట్లయింది.

‘రెస్ట్రిక్టెడ్‌ స్టాక్‌ యూనిట్స్‌ (RSU)’ కింద ఒక్కో షేరును 45 డాలర్ల విలువతో జారీ చేస్తున్నామని ఎక్స్‌ తమ ఉద్యోగులకు తెలిపింది. రానున్న రోజుల్లో వీటిని విక్రయించి సొమ్ము చేసుకునే వెసులుబాటు ఉద్యోగులకు ఉంటుంది. అయితే, పాత యాజమాన్యం ఆధ్వర్యంలో పొందిన షేర్లకు మాత్రం కొనుగోలు సమయంలో నిర్ణయించినట్లుగా ఒక్కో స్టాక్‌పై 54.20 డాలర్లు చెల్లిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, కంపెనీ విలువ సగానికి పడిపోయినప్పటికీ.. షేరు విలువలో కూడా ఆ స్థాయి తగ్గుదల ఎందుకు నమోదు కాలేదనే విషయంపై స్పష్టత లేదు.

ట్విటర్‌ను సొంతం చేసుకున్న వెంటనే కంపెనీలో మస్క్‌ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దాదాపు 80 శాతం ఉద్యోగులను తొలగించేశారు. వెరిఫికేషన్‌ ప్రక్రియను మార్చారు. కంటెంట్‌ మాడరేషన్‌లోనూ మార్పులు తీసుకొచ్చారు. పేరును ట్విటర్‌ నుంచి ‘ఎక్స్‌’గా మార్చారు. మరోవైపు విద్వేషపూరిత సమాచారం పెరిగిపోయిందంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఫలితంగా వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం 60 శాతం తగ్గిందని గత వేసవిలో మస్క్‌ స్వయంగా అంగీకరించారు. అయితే, రానున్న రోజుల్లో ‘ఎక్స్‌’ను ఒక పూర్తి స్థాయి ‘ఎవ్రీథింగ్‌ యాప్‌’గా మార్చనున్నట్లు ఇటీవల ఉద్యోగులను ఉద్దేశించి ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. మరోవైపు రాబోయే రోజుల్లో ఎక్స్‌ను ఒక వ్యక్తి ఆర్థిక జీవితానికి అడ్డాగా మార్చి అసలు బ్యాంకు ఖాతా అవసరమే లేకుండా చేస్తామని పేర్కొన్నారు. 2024 చివరకు చాలా మార్పులు రాబోతున్నాయని పరోక్షంగా ఉద్యోగులకు తదుపరి లక్ష్యాలను నిర్దేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని