Hyderabad News: వంశీకృష్ణ వలలో వెయ్యి మందికి పైనే!

ఆన్‌లైన్‌ వివాహ పరిచయ వేదికల్లో.. రెండోపెళ్లికి సిద్ధమైన మహిళలను మోసగించిన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రామచంద్రరావుపేటకు

Updated : 21 Jul 2022 08:42 IST

ఆరేళ్లలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులకు గాలం 

రూ.40 కోట్ల స్వాహా

వెలుగుచూస్తున్న మాయగాడి లీలలు

ఈనాడు, హైదరాబాద్‌ న్యూస్‌టుడే, నారాయణగూడ: ఆన్‌లైన్‌ వివాహ పరిచయ వేదికల్లో.. రెండోపెళ్లికి సిద్ధమైన మహిళలను మోసగించిన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రామచంద్రరావుపేటకు చెందిన జోగాడ వంశీ కృష్ణ(31) మోసాలు పోలీసుల దర్యాప్తులో మరిన్ని బయటకొచ్చాయి. బీటెక్‌ చేసిన అతడు ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్‌ కూకట్‌పల్లి చేరి, ఆరేళ్ల వ్యవధిలో సుమారు 1000-1500 మంది యువతులు, మహిళలను మోసగించినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వారి నుంచి రూ.40-50 కోట్లు కొట్టేసినట్లు అంచనా కడుతున్నాయి. అతడికి హర్ష, హర్షవర్ధన్‌, చెరుకూరి హర్ష అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. గత మే నెలలో వంశీకృష్ణ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. తాజాగా హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.

2014లో హైదరాబాద్‌కు వచ్చిన వంశీకృష్ణ తొలుత కూకట్‌పల్లిలోని హోటల్‌లో పనిచేశాడు. 2015లో క్రికెట్‌ పందేలకు అలవాటుపడ్డాడు. 2016లో జాబ్‌కన్సల్టెన్సీ/ట్రావెల్‌ ఆఫీసులో చేరాడు. 10 మంది యువకులకు ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసగించిన కేసులో అరెస్ట్‌ అయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక.. మాధురి చౌకి, గాయత్రి.. శ్వేత, స్వాతిక-జెస్సీ, హర్ష కూల్‌ 94 పేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు తెరిచాడు. మహిళలు, యువతులకు తననుతాను యువతిగా పరిచయం చేసుకునేవాడు. సంపాదనలో సగానికి పైగా సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తాడంటూ మారు పేర్లతో ఉన్న ఖాతాల నుంచి తనపై తానే పొగడ్తల వర్షం కురిపించుకునేవాడు. ఇది నిజమని 1000-1500 మందిని నమ్మించాడు. ఉద్యోగం, ఉపాధి, సేవా కార్యక్రమాలంటూ ఒక్కొక్కరి నుంచి పెద్దమొత్తంలో గుంజేవాడు. పరిచయమైన అమ్మాయిలు/మహిళలు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలిస్తే వారికి వెంటనే రూ.1-2లక్షలు ఉదారంగా ఇచ్చేవాడు. దీంతో అతడి గురించి.. వారే ప్రచారం చేసేవారు. ఇలా ఆరేళ్ల వ్యవధిలో ఇంతమందిని మోసగించగలిగాడని అధికారులు చెబుతున్నారు. పోలీసులు నిందితుడి బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.4కోట్ల నగదు లావాదేవీలను స్తంభింపజేశారు. రిమాండ్‌లో ఉన్న అతడిని కస్టడీలోకి తీసుకొని మరింత సమాచారం సేకరించాలని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని