టాయిలెట్‌ క్లీనర్‌ మీద పోసుకొని.. యాసిడ్‌ దాడిగా నాటకం

Eenadu icon
By Crime News Desk Published : 28 Oct 2025 05:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ విద్యార్థిని వ్యవహారంలో అనూహ్య మలుపు 

దిల్లీ: తనపై యాసిడ్‌ దాడి జరిగిందంటూ దేశ రాజధాని దిల్లీలో 20 ఏళ్ల ఓ విద్యార్థిని ఆదివారం ఆరోపించిన వ్యవహారం తాజాగా అనూహ్య మలుపు తిరిగింది. ఆమెపై యాసిడ్‌ దాడి జరగలేదని నిర్ధారణ అయింది. టాయిలెట్‌ క్లీనర్‌ను తనపై తానే పోసుకొని ఆమె అలా నాటకమాడిందని పోలీసులు తేల్చారు. తండ్రి ప్రేరేపించడంతోనే అలా చేసిందని గుర్తించారు. ఓ అత్యాచారం కేసులో అతణ్ని సోమవారం అరెస్టు చేశారు. దిల్లీ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని.. ఆదివారం ఉదయం అదనపు తరగతికి హాజరయ్యేందుకు వెళ్తుండగా తనపై ముగ్గురు వ్యక్తులు- జితేందర్, ఇషాన్, అర్మాన్‌ యాసిడ్‌తో దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు విస్మయం కలిగించే పలు వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. 

ప్రతీకారం కోసం కట్టుకథ 

తనపై దాడి చేసినట్లు విద్యార్థిని చెప్పిన ముగ్గురు వ్యక్తులు అసలు ఆ సమయంలో ఘటనాస్థలంలో లేరని పోలీసులు ఫోన్‌ లొకేషన్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. జితేందర్‌ తన భార్యతో కలిసి అప్పుడు ఘటనాస్థలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఇషాన్, అర్మాన్‌ (వీరిద్దరూ సోదరులు. విద్యార్థినికి దూరపు బంధువులు) కూడా ఆగ్రాలో ఉన్నట్లు తేలింది. మరోవైపు- విద్యార్థిని తండ్రి అకిల్‌ ఖాన్‌ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు జితేందర్‌ భార్య అప్పటికే ఫిర్యాదు చేసి ఉన్న సంగతిని పోలీసులు గుర్తించారు. ఇక ఇషాన్, అర్మాన్‌లతో అకిల్‌ ఖాన్‌కు ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతణ్ని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించగా అసలు విషయాలు అంగీకరించాడు. జితేందర్, ఇషాన్, అర్మాన్‌లపై ప్రతీకారం తీర్చుకునేందుకు తండ్రి ప్రేరేపించడంతోనే.. విద్యార్థిని తమ ఇంటి నుంచి తెచ్చుకున్న సాధారణ టాయిలెట్‌ క్లీనర్‌ను మీద పోసుకొని యాసిడ్‌ దాడిగా నాటకాలాడిందని పోలీసులు చెప్పారు. అకిల్‌ ఖాన్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఇషాన్, అర్మాన్‌ల తల్లి కూడా 2018లో ఆరోపించడం గమనార్హం. యాసిడ్‌ దాడి కట్టుకథ అల్లడంతోపాటు జితేందర్‌ భార్య చేసిన అత్యాచార ఆరోపణ కేసులో అకిల్‌ ఖాన్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని