Korutla: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి మృతి కేసు.. పోలీసుల అదుపులో చందన ?

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం భీమునిదుబ్బ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

Updated : 01 Sep 2023 20:55 IST

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం భీమునిదుబ్బ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి అనుమానాస్పద మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. దీప్తి మృతి చెందిన రోజు ఆమె చెల్లెలు చందన ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ యువకుడితో కలిసి నిజామాబాద్‌ బస్సులు ఆగేచోట కూర్చుని, కొద్దిసేపటికి నిజామాబాద్‌ వెళ్లే బస్సులో ఎక్కినట్లు రికార్డు అయింది.

నాలుగు రోజుల నుంచి చందన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మర గాలింపు చేపట్టారు. విదేశాలకు వెళ్లకుండా లుక్‌అవుట్‌ నోటీసులు కూడా జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈక్రమంలో శుక్రవారం ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద చందన, ఆమె ప్రియుడు, వారికి సహకరించిన కారు డ్రైవర్‌, ఆశ్రయం కల్పించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆమెతో పాటు ఉన్న యువకుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరినీ కోరుట్లకు తీసుకొచ్చి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, చందనని అదుపులోకి తీసుకున్న విషయం పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి? ఇంకెవరైనా మద్యం తాగారా? చందన ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

ఘటన జరిగిందిలా...

భీమునిదుబ్బలో బంక శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి దీప్తి(24), చందన, సాయి సంతానం. దీప్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా ఏడాదిన్నర క్రితం చేరారు. ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తున్నారు. చందన బీటెక్‌ పూర్తి చేసి, ఇంటి వద్దే ఉంటున్నారు. కుమారుడు సాయి బెంగళూరులో ఉంటున్నారు. బంధువుల ఇంట్లో గృహప్రవేశం ఉండటంతో ఆదివారం... శ్రీనివాస్‌రెడ్డి, మాధవి హైదరాబాద్‌కు వెళ్లారు. సోమవారం రాత్రి 10 గంటలకు వారిద్దరూ కుమార్తెలతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం ఫోన్‌ చేయగా దీప్తి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. చందన ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ వచ్చింది. వెంటనే ఇంటి ముందున్న వారికి సమాచారమివ్వగా వారొచ్చి... దీప్తి మృతి చెంది ఉండడాన్ని గమనించారు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి, కోరుట్ల, మెట్‌పల్లి సీఐలు ప్రవీణ్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, ఎస్సై కిరణ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

దీప్తి మృతదేహం సోఫాలో పడి ఉండగా, వంట గదిలో రెండు మద్యం సీసాలు, కూల్‌డ్రింక్‌ బాటిల్‌, తినుబండారాల ప్యాకెట్లు కనిపించాయి. చందన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె, ఓ యువకుడు కలిసి ఉదయం 5.12 నుంచి 5.16 గంటల వరకు నిజామాబాద్‌ బస్సులు ఆగేచోట కూర్చుని, కొద్దిసేపటికి నిజామాబాద్‌ వెళ్లే బస్సులో ఎక్కినట్లు రికార్డు అయింది. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీప్తి శరీరంపై గాయాలున్నట్టు పోస్టుమార్టం చేసిన వైద్యులు గుర్తించారు. దీంతో ఈ కేసులో పోస్టు మార్టం నివేదిక కీలకంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని