logo

ఈవీఎంలపై అపోహలు వద్దు

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం) పనితీరుపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు. పక్కా సాఫ్ట్‌వేర్‌తో తయారు చేసినట్లు కలెక్టర్‌/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎన్నికల పరిశీలకులు అజయ్‌నాథ్‌ ఝు, మనీష్‌ సింగ్‌ తెలిపారు.

Published : 02 May 2024 03:55 IST

కలెక్టర్‌, ఎన్నికల పరిశీలకులు

రాప్తాడు: పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం) పనితీరుపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు. పక్కా సాఫ్ట్‌వేర్‌తో తయారు చేసినట్లు కలెక్టర్‌/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎన్నికల పరిశీలకులు అజయ్‌నాథ్‌ ఝు, మనీష్‌ సింగ్‌ తెలిపారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ రెవెన్యూ భవన్‌లో ఈవీఎంలపై రెండవ ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు, ప్రధాన ఏజెంట్లు హాజరయ్యారు. అక్కడే ఈవీఎంల భద్రత, పనితీరు, పారదర్శకతపై ఈఎంఎస్‌ 2.0 సాఫ్ట్‌వేర్‌లో ఆన్‌లైన్‌ ద్వారా సమగ్ర అవగాహన కల్పించారు. ర్యాండమైజేషన్‌ ద్వారా ఈవీఎంలు ఏయే పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించామన్నది స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఎవరూ ఏ దశలోనూ అనుమానం, అపోహ పడొద్దన్నారు. ప్రతీది పక్కాగా సాగుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఖర్చును రోజూ లెక్కించాలి.. అప్పటికప్పుడే నిర్దేశిత ప్రొఫార్మాలో నమోదు చేయాలి. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని వ్యయ పరిశీలకుడు విలాస్‌ వి.షిండే పేర్కొన్నారు.

అదనంగా 1523 ఈవీఎంలు

అనంత జిల్లాలో లోక్‌సభ, తాడిపత్రి అసెంబ్లీ స్థానాలకు ఎక్కువ మంది పోటీలో ఉండటంతో ఈవీఎంల కొరత ఏర్పడింది. లోక్‌సభకు 21 మంది, తాడిపత్రి స్థానానికి 18 మంది ప్రకారం పోటీలో ఉన్నారు. ఇక్కడ రెండేసి ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. అందుకే సత్వరమే అదనంగా మరో 1523 ఈవీఎం, కంట్రోల్‌ యూనిట్లను తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పొరుగు జిల్లాలైన కడప నుంచి 470, శ్రీసత్యసాయి జిల్లా నుంచి 1053 ప్రకారం అదనంగా ఈవీఎం, సీయూలను తెప్పిస్తున్నారు.

పోలింగ్‌ కేంద్రాల తనిఖీ

రాప్తాడు: అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం రాప్తాడు మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రాలను, బుధవారం సహాయ కలెక్టర్‌ వినూత్నతో కలిసి అనంత నగరంలోని పలు పోలింగు కేంద్రాలను తనిఖీ చేశారు. పోలింగ్‌ రోజు ఓటు వేయడం అత్యంత కీలకమని, అందరూ ఓటువేసేందుకు ముందుకు రావాలని.. బీఎల్వోలకు ఓటర్లందరూ తెలిసి ఉండాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని