logo

పునరుద్ధరించని రైళ్ల రాయితీలు

కొవిడ్‌ నిబంధనలను కేంద్రం తొలగించింది. జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కానీ రైల్వే మాత్రం మహమ్మారి నిబంధనలను కొనసాగిస్తూ వస్తోంది. ప్రత్యేక రైళ్ల పేరుతో రైలు నంబరుకు ముందు సున్నా జోడించి అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికుల

Published : 25 May 2022 04:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ నిబంధనలను కేంద్రం తొలగించింది. జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కానీ రైల్వే మాత్రం మహమ్మారి నిబంధనలను కొనసాగిస్తూ వస్తోంది. ప్రత్యేక రైళ్ల పేరుతో రైలు నంబరుకు ముందు సున్నా జోడించి అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికుల నుంచి నిరసనలు రావడంతో సాధారణ రైళ్లుగా మార్చింది. కొవిడ్‌ సమయంలో అత్యవసర ప్రయాణాలనే ప్రోత్సహించాలనే నిబంధనలను అనువుగా మార్చుకొని సొమ్ము చేసుకుంటోంది. ఇప్పటికీ పలు వర్గాల వారికి రాయితీలను పునరుద్ధరించలేదు. ప్రస్తుతం కేవలం 14 వర్గాల వారికి సబ్సిడీలను కొనసాగిస్తోంది.
కోత ఎందుకు?
కరోనా సాకు చూపి.. ప్రత్యేక రైళ్లంటూ.. దాదాపు ఏడాదిపాటు 30 శాతం అదనంగా ఛార్జీలను వసూలు చేయడమే కాకుండా.. 64 రకాల రాయితీలకు ఎగనామం పెట్టింది. ప్రయాణికుల నుంచి విమర్శలు రావడంతో ఎట్టకేలకు 14 రకాల రాయితీలను మాత్రమే అనుమతిచ్చి.. 50 సబ్సిడీలకు మంగళం పాడింది. అన్నీ సాధారణ రైళ్లు అయినప్పుడు.. రాయితీల విషయంలో ఎందుకు కోత అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
కొందరికి మాత్రమే..
రాజధాని ఎక్స్‌ప్రెస్‌తోపాటు వేసవి ప్రత్యేక రైళ్లలో కూడా రాయితీలు ఇవ్వడంలేదు. సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లలో దివ్యాంగులకు రాయితీ లేదు. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, రక్తహీనత, క్యాన్సర్‌, హృద్రోగ, జన్యుపరమైన వ్యాధులు, హిమోఫిలియా, కిడ్నీ, కుష్ఠు, టీబీ, తలసేమియా, విద్యార్థులు, అంధులు, చెవిటి, మూగ, మానసిక రోగులకు మాత్రమే రైల్వే రాయితీలను ఇస్తోంది.
వయోవృద్ధులపై చిన్నచూపు..
వయోవృద్ధులపై రైల్వే చిన్నచూపు చూస్తోంది. 60 ఏళ్లు నిండిన పురుషులు, 58 ఏళ్లు పూర్తయిన మహిళలకు 50 శాతం రాయితీ ఇచ్చేది. అన్ని తరగతుల ప్రయాణాలకు వీటిని వర్తింపజేసింది. కరోనా తర్వాత రద్దు చేసింది. వైద్యులు, నర్సులు, కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధులు, క్రీడాకారులు, విధులపై వెళ్లే పోలీసులు, జర్నలిస్టులకు, పద్మ అవార్డు గ్రహీతలకు.. ఇలా 50 రకాల సబ్సిడీలను రైల్వే రద్దు చేసింది. సాధారణ రైళ్లు నడుపుతూ.. ఆరు నెలలు దాటినా.. పునరుద్ధÄరించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని