logo

యథేచ్ఛగా గ్యాస్‌ రీఫిల్లింగ్‌ దందా

నగరంలో గ్యాస్‌ రీఫిల్లింగ్‌ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఖాతా పుస్తకాలతో బుకింగ్‌, విక్రయించడం నుంచి ఏజెన్సీలతోనే డీల్‌ కుదుర్చుకునే వరకు దందా విస్తరించింది.

Published : 23 Mar 2023 02:56 IST

ఏజెన్సీల నుంచి బల్క్‌గా విక్రయాలు

పౌరసరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న సిలిండర్లు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో గ్యాస్‌ రీఫిల్లింగ్‌ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఖాతా పుస్తకాలతో బుకింగ్‌, విక్రయించడం నుంచి ఏజెన్సీలతోనే డీల్‌ కుదుర్చుకునే వరకు దందా విస్తరించింది. బల్క్‌గా 14.5కేజీల గృహావసర సిలిండర్లను కొనుగోలు చేసి 19 కేజీల వాణిజ్య సిలిండర్లలోకి రీఫిల్లింగ్‌ చేసి విక్రయిస్తున్నారు. దీంతో ఆయిల్‌ కంపెనీలకు వాణిజ్య సిలిండర్ల ద్వారా సమకూరే ఆదాయానికి గండిపడుతోంది.

గృహావసర సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.1,150, వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,350గా ఉంది. ఫిల్లింగ్‌ పైపుల ద్వారా గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తూ ఒక్కో సిలిండర్‌పై సుమారు రూ.300 నుంచి రూ.500 వరకు సొమ్ము చేసుకుంటున్నారు. ఇవేకాదు 5కేజీల సిలిండర్లను సైతం ఇలాగే రీఫిల్లింగ్‌ చేసి అమ్ముతున్నారు. ఒక్కో సిలిండర్‌ రూ.700 నుంచి రూ.800 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

తాజా ఉదంతం..

* రెండేళ్లుగా జగద్గిరిగుట్టలో ఈ దందా చేస్తున్న 9 మందిని బాలానగర్‌ జోన్‌ ఎస్‌వోటీ, జగద్గిరిగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 267 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. (డొమెస్టిక్‌ - 67, కమర్షియల్‌- 190) ఉన్నాయి. ఇందులో ఏజెన్సీ నిర్వహించే వ్యక్తే ప్రధాన నిందితుడు.

* పౌర సరఫరాల శాఖ ఇటీవల 9 సర్కిళ్లలో జరిపిన తనిఖీల్లోనూ 115 కేసులు నమోదు చేసి 227 కేసులు నమోదు చేశారు. గడ్డి అన్నారంలో 11, యాకుత్‌పురాలో 12, కార్వాన్‌లో 8, గౌలిగూడలో 12, దారుస్సలాంలో 16, అంబర్‌పేట్‌లో 12, ఖైరతాబాద్‌లో 13, బేగంపేట్‌లో 14, సికింద్రాబాద్‌లో 17 కేసులు నమోదు చేశారు.

జనావాసాల్లో ప్రమాదకరంగా..

* రాజస్థాన్‌ నుంచి వలస వచ్చిన ఇద్దరు నార్సింగిలో కిరాణా దుకాణం నిర్వహిస్తూనే మరో అద్దెగదిలో రీఫిల్లింగ్‌ దందా ప్రారంభించారు. చిన్న సిలిండర్లలోకి గ్యాస్‌ నింపుతుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుని ఇద్దరూ తీవ్రగాయాలతో మృతిచెందారు.

* కర్మన్‌ఘాట్‌లోని భూపేష్‌గుప్తానగర్‌లో ఇలాగే రీఫిల్లింగ్‌ చేస్తుండగా ఒకేసారి ఐదారు సిలిండర్లు పేలిపోయాయి. ఇనుప ముక్కలు వందమీటర్ల దూరంలో పడిపోయాయి. జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

* సుభాష్‌నగర్‌లో ఇళ్ల మధ్యే రీఫిల్లింగ్‌ చేస్తున్న సమయంలో పేలుడు సంభవించి ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఆన్‌లైన్‌ బుకింగ్‌ నుంచి సర్దుబాట్లు..

పేమెంట్‌ గేట్‌వేల ద్వారా బుక్‌ చేస్తే 3 రోజుల్లోగా డెలివరీ చేయాలన్న నిబంధనను కొన్ని ఏజెన్సీలు పాటించడం లేదు. బుక్‌ చేసిన 15 రోజులకు డెలివరీ అవడం లేదు. దీన్ని కొందరు సీరియస్‌గా తీసుకుని ఫిర్యాదు చేసే వరకు వెళ్తే రెండ్రోజుల్లో సర్దుబాటు చేస్తామని, ఎవరైనా అడిగితే డెలివరీ అయ్యిందని చెప్పాలంటూ అభ్యర్థిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని