logo

పర్యాటక రంగంపై వైకాపా పడగ

గమ్య నగరంగా విశాఖకున్న పేరును వైకాపా పాలకులు బంగాళాఖాతంలో కలిపేశారు. జగన్‌ సర్కారు హయాంలో పర్యాటక రంగం కుదేలైంది.

Updated : 30 Apr 2024 06:19 IST

అనుబంధ రంగాలు కుదేలు
ఉపాధి అవకాశాలకు గండి
ఈనాడు, విశాఖపట్నం

మ్య నగరంగా విశాఖకున్న పేరును వైకాపా పాలకులు బంగాళాఖాతంలో కలిపేశారు. జగన్‌ సర్కారు హయాంలో పర్యాటక రంగం కుదేలైంది.

  • ఏటా డిసెంబరులో మూడు రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవాల వీక్షణకు అనేక ప్రాంతాల నుంచి లక్షల మంది వచ్చేవారు. భీమిలి, అరకు ఉత్సవాల వంటివి కూడా నిర్వహించి పర్యాటకానికి తెదేపా కొత్త రూపురేఖలు తీసుకొచ్చింది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక వాటిని పట్టించుకున్న దాఖలాలే లేవు. 2019లో మినహా మరెప్పుడూ నిర్వహించలేదు.
  • 2017, 2018 సంవత్సరాల్లో జిల్లాకు రెండు కోట్ల మందికి పైగా సందర్శకులు వస్తే వైకాపా అయిదేళ్ల పాలనలో ఎప్పుడూ ఆ సంఖ్య దాటలేదు. విదేశీయులైతే ఇప్పుడు కనిపించడమే అరుదు.
  • తెదేపా హయాంలో ఓ ట్రావెల్‌ సంస్థకు ఏడాదికి రూ.కోటి వ్యాపారం సాగితే... వైకాపా వచ్చాక రూ.30 లక్షల వ్యాపారం కూడా జరగలేదు. అలాగే టూరిజం ప్యాకేజీలు నిర్వహించే ఓ సంస్థకు ఏటా రూ.50 లక్షల వ్యాపారం జరగ్గా ఈ అయిదేళ్లు కలిపినా ఆ మొత్తం దాటలేదంటే పర్యాటకరంగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

రెండుగా విడిపోయిన తేలియాడే వంతెన

నగరానికి ఆయువు పట్టులాంటి పర్యాటక రంగంపై శీతకన్నేయడంతో పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు దూరమయ్యాయి. ఈ రంగంపై ఆధారపడిన అనుబంధ రంగాలు కుదేలయ్యాయి. తెదేపా హయాంలో మొదలైన పలు నిర్మాణాలను వైకాపా అసంపూర్తిగా వదిలేసింది. రుషికొండపై రాజసౌధంలాంటి  నిర్మాణం కట్టుకోవడం మినహా చేసిందేమీ లేదు. ఇలాంటి ప్రభుత్వానికి ఎన్నికల్లో తగు తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని జనం చెబుతున్నారు.

రిసార్టులు అస్తవ్యస్తం: విశాఖ డివిజన్‌ కేంద్రంగా పర్యాటకశాఖకు చెందిన రిసార్టులు అధ్వానంగా మారాయి. టైడా, అరకు, అనంతగిరిలోని రిసార్టుల గదులు చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. అందులో ఉండేందుకు సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి వచ్చిన పర్యాటకులు మళ్లీ రావాలంటే సంకోచిస్తున్నారు. కొద్ది రోజుల కిందట అప్పూఘర్‌ వద్ద భవనాల నవీకరణ పేరుతో హడావుడి చేసి వదిలేశారు.

గతంలో రుషికొండ హిల్‌ రిసార్టు నుంచి అధిక మొత్తంలో ఆదాయం వచ్చేది. ఇప్పుడు రూపాయైనా రావడం లేదు. ఇక్కడి రాజసౌధ నిర్మాణాన్ని ఫిబ్రవరిలో అట్టహాసంగా టూరిజం రిసార్టుగానే ప్రారంభించారు. ప్రస్తుతం దాన్ని ఖాళీగా ఉంచారే తప్ప ఎటువంటి పర్యాటక సేవల కోసం వినియోగించలేదు.

మూలకు చేరిన పర్యాటక శాఖ పడవలు

ఎక్కడికక్కడ అధ్వానం: ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు నగరానికి వస్తుంటారు. గతంలో విదేశీయులు ఎక్కువగా వచ్చేవారు. నగరానికి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా కైలాసగిరిని సందర్శిస్తారు. అటువంటి ప్రాంతాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మూడేళ్ల పాటు అసంపూర్తి పనులతో కాలయాపన చేసింది.  

  • బ్లూఫ్లాగ్‌ గుర్తింపు వచ్చిన రుషికొండ బీచ్‌ నిర్వహణ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేది. మిరుమిట్లు గొలిపే విద్యుత్తు కాంతులతో ఆహ్లాదంగా ఉండేది.  జగన్‌ సర్కారు దాన్ని గాలికొదిలేసింది. తాగునీటి సదుపాయం కూడా కల్పించలేదు.
  • ‘ఎంవీ మా’ అనే ప్రైవేటు నౌక తెన్నేటి పార్కు తీరానికి కొట్టుకొచ్చింది. దాన్ని ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా మార్చి పర్యాటకాన్ని ఉద్ధరిస్తున్నట్లు వైకాపా నేతలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పర్యాటకశాఖతో అయ్యే పని కాదని వదిలేశారు. ఎన్నికల ప్రకటనకు ముందు గొప్పలకు పోయి ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా...అది రెండు ముక్కలవడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని