logo

చిరుధాన్యం.. ఆరోగ్య భాగ్యం

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తప్పనిసరి.. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఎంతో అవసరం.. నిర్లక్ష్యం చేస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మరణాలు సంభవించే ప్రమాదం లేకపోలేదు.. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లేకపోడంతో గర్భిణులు, చిన్నారులు, బాలింతలు సరైన ఆహారం తీసుకోవడం లేదు.

Updated : 18 Mar 2024 05:45 IST

పోషణ పక్షోత్సవాల్లో అవగాహన

న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్‌: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తప్పనిసరి.. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఎంతో అవసరం.. నిర్లక్ష్యం చేస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మరణాలు సంభవించే ప్రమాదం లేకపోలేదు.. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లేకపోడంతో గర్భిణులు, చిన్నారులు, బాలింతలు సరైన ఆహారం తీసుకోవడం లేదు. దీంతో అనేక రుగ్మతలకు లోనవుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడమే కాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించేలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మార్చి 9 నుంచి 23వ తేదీ వరకు పోషణ పక్షం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలు తీసుకోవడంతో కలిగే లాభాలు, పరిసరాల పరిశుభ్రత, పోషకాహార అవగాహన చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించడంతో పాటు రక్తహీనతతో కలిగే నష్టాలు, కిశోర బాలికలకు అవగాహన సదస్సు తదితర కార్యక్రమాలను చేపట్టనున్నారు. చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలను అంగన్‌వాడీ కేంద్రాలకు పిలిపించి పౌష్టికాహారం తయారు చేయాల్సిన విధానంపై అవగాహన కల్పించడం, చేతులశుభ్రత, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించనున్నారు. వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం లాంటి కార్యక్రమాలను చేపడుతారు.

చిన్నారుల్లో పోషకాహార లోపం..

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా తీవ్ర పోషకాహార లోపం, అతి తక్కువ బరువు, తక్కువ బరువు, వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం తదితర అనారోగ్య సమస్యలతో ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలో చిన్నారులు బాధపడుతున్నారు. రోగనిరోధక శక్తి పెరగాలంటే.. పౌష్టికాహారం అందించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. గత జనవరిలో అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో సరిపడా బరువున్న పిల్లలు 1.62 లక్షల మంది ఉండగా, వయసుకు తగిన ఎత్తు 1.67 లక్షల మంది పిల్లలు, ఎత్తుకు తగిన బరువు ఉన్న పిల్లలు 1.84 లక్షల మంది ఉన్నారు.

అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం

నాగేశ్వర్‌రావు, జిల్లా సంక్షేమాధికారి, భూపాలపల్లి

పోషణË పక్షం కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా మార్చి 9 నుంచి 23వ తేదీ వరకు 15 రోజుల పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నాం.చిరుధాన్యాలతో లాభాలు, పౌష్టికాహారం తీసుకోవడం, తయారు చేయడం లాంటి పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నాం.. పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత తదితర అంశాలపై చైతన్యం చేస్తున్నాం..

ప్రయోజనాలివీ..

  • రాగులు, సజ్జలు, కొర్రలు, అరికెలు, వరిగెలు, సామలు ఇలాంటి చిరుధాన్యాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..
  • పిల్లలకు రాగి ముద్ద పెడితే ఎముకలు బలంగా ఉండటంతో పాటు, దంతాలు కూడా దృఢంగా మారుతాయి.
  • ధాన్యాల్లో పీచు పదార్థం అధికంగా ఉండటంతో త్వరగా జీర్ణమవుతాయి. రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతం పెంచుతాయి.. తద్వారా రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు.
  • ఎదిగే పిల్లల్లో నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. చిరుధాన్యాల్లో ట్రిప్టోఫాన్‌ అనే అమినో యాసిడ్‌ అధికంగా ఉంటుంది.
  • బుద్ధిమాంద్యం, మృత శిశువుల జననం, పిల్లల మరణాలు, పురుటి నొప్పుల మరణాలు నివారించవచ్చు. పిల్లల్లో ఏకాగ్రత ఉండటంతో పాటు చురుగ్గా, ఉల్లాసంగా ఉంటారు.
  • చిన్నారులు పెరిగే కొద్దీ శిశువుకు ఇచ్చే ఆహారం మెత్తగా సులభంగా తినేలా ఉండాలి.
  • వీటితో పాటు ఇంట్లో వినియోగించే ఆహార పదార్థాలైన బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జలు లాంటి ధాన్యాలు, అలాగే పెసర, శనగ, పుట్నాలు తదితర పప్పు దినుసులు, వేరుశనగ, నువ్వులు, చక్కెర, బెల్లం తదితర వాటితో అదనపు ఆహార పదార్థాలను తయారు చేసి అందించడంతో పోషకాలు సమృద్ధిగా అందుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని