రోగనిరోధక శక్తిని తగ్గించే అలవాట్లు ఇవి!

కరోనా నేపథ్యంలో ప్రజలందరికీ ఆరోగ్యంపై మరింత అవగాహన పెరిగింది. మహమ్మారి వైరస్‌కు ఇప్పటి వరకు వ్యాక్సిన్‌, ఔషధం అందుబాటులోకి.....

Published : 11 Dec 2020 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా నేపథ్యంలో ప్రజలందరికీ ఆరోగ్యంపై మరింత అవగాహన పెరిగింది. మహమ్మారి వైరస్‌కు ఇప్పటి వరకు వ్యాక్సిన్‌, ఔషధం అందుబాటులోకి రాకపోవడంతో ప్రస్తుతం రోగనిరోధకశక్తినే పెంచుకోవడమే సరైన మార్గంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ, కొన్ని అలవాట్లు మనలోని రోగనిరోధక శక్తిని తగ్గించేసి ప్రమాదకర స్థితిలోకి తీసుకెళ్తున్నాయని తెలుసా? ఆ అలవాట్లు ఏటంటే..?

అధిక మద్యం సేవిస్తే..

నిత్యం మద్యం సేవించేవారిలో కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశంతోపాటు రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. మద్యం ఎక్కువగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని.. తద్వారా మొదట న్యూమోనియా రావడం, అనంతరం శ్వాస తీసుకోవడంలోనూ సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో కరోనా సోకితే దాని తీవ్రత అధికంగా ఉంటుంది. అందుకే మద్యం సేవించడం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.


ఉప్పుతో ముప్పు

ఎంత బాగా వండినా.. ఎన్ని మసాలాలు వేసినా వంటలో ఉప్పు లేకపోతే రుచే ఉండదు. ఆహార పదార్థాల్లో దానికి అంత ప్రాధాన్యం ఉంది. అలా అని అధిక మొత్తంలో ఉప్పును తింటే రక్తపోటు పెరుగుతుందని అందరికి తెలిసిందే. కానీ, దీని వల్ల రోగనిరోధకశక్తి బలహీనపడుతుందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. శరీరంలోని అధిక సోడియంను మూత్రపిండాలు వడపోసే సమయంలో డొమినే ఎఫెక్ట్‌ సంభవిస్తుందని, దీని వల్ల శరీరం బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుందని పరిశోధకులు తెలిపారు. 


చక్కెరతో జాగ్రత్త సుమీ..

తీపి అంటే ఎవరికి చేదు చెప్పండి. రోజులో ఏదో రకంగా మనం తీపి పదార్థాలు తింటూ ఉంటాం. కానీ దాన్ని ఇష్టపడే వారు మరింత అధికంగా చక్కెర తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల డయాబెటిస్‌, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని అందరికీ తెలుసు. ఇలా అధిక మోతాదులో చక్కెర వినియోగం వల్ల రోగనిరోధక కణాల పని సామర్థ్యం కూడా తగ్గిపోతుందని పరిశోధకులు ఇటీవల చేసిన అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి చక్కెర తీసుకునే సమయంలో మోతాదు మించకుండా చూడండి.


కాఫీ, టీ ఎక్కువగా తాగుతున్నారా?

కాఫీ, టీ తాగడం వల్ల కలిగే లాభనష్టాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కొన్నిసార్లు అవి తాగడం మంచిదేనంటారు.. కొన్నిసార్లు వాటి వల్ల గుండెసంబధిత వ్యాధులు వచ్చే అవకాశముందంటారు. వీటి గురించి పక్కన పెడితే.. కాఫీ, టీలో ఉండే కెఫిన్‌ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. సాధారణంగా నిద్రరాకుండా ఉండటం కోసం కాఫీ, టీలు తాగుతుంటారు. ఇలా అధికంగా తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. ఫలితంగా కడుపులో మంటగా ఉండటం, రోగనిరోధకశక్తి తగ్గడం వంటివి జరుగుతాయి.


జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి

యువత, పిల్లలు ఎక్కువగా జంక్‌ఫుడ్‌ తింటుంటారు. వారాంతం వస్తే చాలు, ఇంటి వంట పక్కన పెట్టి.. పిజ్జా, బర్గర్లు కావాలంటూ మారం చేస్తారు. తల్లిదండ్రులు కాదనలేక కొనిస్తుంటారు. కానీ, ఈ జంక్‌ఫుడ్‌ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీటి వల్ల శరీరంలో కొవ్వు పెరిగి, రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. దీంతో సులువుగా వ్యాధులు శరీరంలోకి వచ్చి చేరుతాయి. కాబట్టి ఈ జంక్‌ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండండి.


ఒత్తిడికి గురికావడం

ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురికావడం మానసిక అనారోగ్యానికి దారితీయొచ్చు. ఒత్తిడి వల్ల రక్తపోటు పెరుగుతుంది. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జీర్ణక్రియపై కూడా ప్రభావం పడుతుంది. ఫలితంగా శరీరంలో హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది.


మరి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

* విటమిన్లు, పోషకాలు మెండుగా ఉండే పండ్లు.. కూరగాయాలు ఎక్కువగా తినాలి.
* పీచు పదార్థాలు జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా పోషకాలు శరీరంలో చేరి రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
* వ్యాయామం, యోగా వంటివి మానసిక ఒత్తడిని తగ్గిస్తాయి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
* తరచూ నీరు తాగాలి. 
* ఆకు కూరల్లో విటమిన్‌ ఏ, సీ, కే ఉంటాయి. మెగ్నిషియం, కాల్షియం వంటి పోషకాలుంటాయి. కాబట్టి ఆకుకూరల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని