TS Assembly: కేసీఆర్‌కు పదవులిచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ: సీఎం రేవంత్‌

తెలంగాణ శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీవే‘ఢీ’గా చర్చ జరిగింది.

Updated : 16 Dec 2023 14:17 IST

హైదరాబాద్‌: అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఆకాంక్షించారు. కేసీఆర్‌కు (KCR) పదవులిచ్చిందే కాంగ్రెస్‌ (Congress) పార్టీ అని చెప్పారు. ఈ మేరకు గవర్నర్‌ (Tamilisai Soundararajan) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీవే‘ఢీ’గా చర్చ జరిగింది. శనివారం శాసనసభ (Telangana Assembly) సమావేశాలు ప్రారంభం కాగానే.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ పేరును సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని శాసనసభలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించగా.. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి బలపరిచారు. 

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన చరిత్ర భారాసదే: భట్టి

ఆ తర్వాత భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. గవర్నర్‌ ప్రసంగమంతా తప్పుల తడకగా, సత్యదూరంగా ఉందని ఆరోపించారు. ఆయన మాట్లాడుతుండగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar) అడ్డు తగిలారు. 2014కు ముందు అన్యాయం జరిగిందనే తెలంగాణ కోసం కొట్లాడినట్లు చెప్పారు. ప్రసంగం మొదలు పెట్టడమే కేటీఆర్‌ (KTR) దాడి చేస్తున్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. నిర్మాణాత్మక సూచనలు ఇస్తే తీసుకుంటామని తెలిపారు. ‘‘రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన చరిత్ర భారాసదే. ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా కట్టిన వ్యవస్థలు, సంస్థలను ధ్వంసం చేశారు. తెలంగాణను రూ.5లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారు’’ అని భట్టి అన్నారు.

50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను ఏమనాలి?

దీంతో తెలంగాణ రాకముందు బీడువారిన భూములు ఉండేవని, 10 ఏళ్ల భారాస పాలనను విధ్వంసం అంటే.. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను ఏమనాలి?అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి 3 నెలల సమయం ఇద్దామని కేసీఆర్‌ చెప్పారన్నారు. భారాస అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల పక్షమేనన్నారు. గత కాంగ్రెస్‌ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉన్నాయని.. పదవుల కోసం పెదాలు మూసిన చరిత్ర కాంగ్రెస్‌ది అని చెప్పారు.

మేం చెప్పే ప్రయత్నం చేసినా వారు తెలుసుకోరు: సీఎం

కేటీఆర్‌ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ‘‘కొంతమంది ఎన్‌ఆర్‌ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే అర్థం తెలియట్లేదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకోరు. సభ్యుల సంఖ్య ముఖ్యం కాదు.. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై పోరాడింది కాంగ్రెస్‌ నేతలే. కేసీఆర్‌కు వివిధ పదవులు ఇచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ’’ అని చెప్పారు.

అప్పుడు ఒక్క పీజేఆర్‌ తప్ప ఎవరూ మాట్లాడలేదు..

సీఎం రేవంత్‌ సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని హరీశ్ రావు (Harish Rao) కలగజేసుకున్నారు. ‘‘అప్పుడు పోతిరెడ్డి ప్రాజెక్టును ఆపాలని మేం కోరాం. ఆరు కారణాలతో మేం ఆ రోజు రాజీనామా చేశాం. అప్పట్లో మంత్రులుగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు ఎవరూ మాట్లాడలేదు. ఒక్క పీజేఆర్‌ తప్ప ఎవరూ పోతిరెడ్డిపాడుపై మాట్లాడలేదు. మేం గెలిచి.. కాంగ్రెస్‌ పార్టీకి భిక్ష పెట్టాం. మేం పొత్తు పెట్టుకోవడం వల్లే నాడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది’’ అని తెలిపారు. ఆపై కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాకుండా దిల్లీ నామినేట్‌ చేసిన వ్యక్తి సీఎం అయ్యారు. పదేళ్లలో మహబూబ్‌నగర్‌లో వలసలు ఆగిపోయాయి. ఎన్‌ఆర్‌ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరో చెప్పాలి?. సోనియా గాంధీని బలిదేవత అన్నది ఎవరో అందరికీ తెలుసు. మేనిఫెస్టోలోని హామీలను కాంగ్రెస్‌ అమలు చేయాలి. కోటిన్నర మంది మహిళల ఖాతాలో రూ.2,500 వేస్తామన్నారు. డబ్బులు ఎప్పుడు ఇస్తారా? అని మహిళలు ఎదురుచూస్తున్నారు. మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తే స్వాగతిస్తాం’’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని