Tamilisai: తెలంగాణలో నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారు: తమిళిసై

మన రాజ్యాంగం ఎంతో మహోన్నతమైందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందుచూపుతో వ్యవహరించి దానిని తయారు చేశారన్నారు.

Updated : 26 Jan 2024 10:01 IST

హైదరాబాద్‌: మన రాజ్యాంగం ఎంతో మహోన్నతమైందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందుచూపుతో వ్యవహరించి దానిని తయారు చేశారని చెప్పారు. అన్ని వర్గాల ఆశలు, ఆశయాల సాధనకు రాజ్యాంగం తోడ్పడిందని వివరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు. అంతకుముందు గవర్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, అధికారులు స్వాగతం పలికారు. పోలీసులు, సైనికుల నుంచి గవర్నర్‌ గౌరవ వందనం స్వీకరించారు.

ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు

మన దేశం.. భిన్న జాతులు, మతాలు, కులాల సమాహారమని తమిళిసై అన్నారు. అందరినీ ఐక్యం చేసి ఒకే జాతిగా నిలబెట్టిన ఘనత రాజ్యాంగానిదేనని చెప్పారు. ‘‘బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాజ్యాంగం మార్గదర్శకత్వంలో ముందుకెళ్లడం గర్వించదగ్గ విషయం. ఆ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు ముందుకెళ్తే ప్రజలు ఊరుకోరు. గడిచిన పదేళ్లలో అలాగే వ్యవహరించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే రాష్ట్రం సాధించుకున్నాం. నియంతృత్వ ధోరణితో వెళ్లడాన్ని తెలంగాణ సమాజం సహించదు. ఎన్నికల్లో తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని విస్పష్టమైన తీర్పు ఇచ్చారు.

ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే లక్ష్యం

విధ్వంసానికి గురైన వ్యవస్థలను పునర్‌ నిర్మించుకుంటున్నాం. రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలిస్తేనే పేదవాడికి అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి శోభనివ్వవు. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే లక్ష్యం. ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైంది. ‘మహాలక్ష్మి’ కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. మిగతా గ్యారంటీలనూ అమలు చేస్తాం. గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రణాళికలు రచిస్తున్నాం.

రూ.2 లక్షల రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు

సంక్షేమంలో సరికొత్త అధ్యాయం లిఖించేలా కొత్త ప్రభుత్వ పాలన ఉంటుంది. యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాం. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతాం. దీనిపై ఎలాంటి అపోహలకూ యువతకు లోనుకావొద్దు. దావోస్‌ సదస్సులో రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఇందుకు సీఎం, ఆయన బృందాన్ని అభినందిస్తున్నా. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రూ.2 లక్షల రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రజావాణి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే యోచనలో ఉన్నాం’’ అని గవర్నర్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని