Andhra Pradesh: తీవ్ర తుపానుగా మిగ్‌జాం.. ఈ జిల్లాల్లో తీవ్ర ప్రభావం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగ్‌జాం తుపాను (Michaung Cyclone) తీవ్ర తుపానుగా బలపడింది. ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని ఇది కదులుతోంది.

Updated : 04 Dec 2023 21:32 IST

అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగ్‌జాం తుపాను (Michaung Cyclone) తీవ్ర తుపానుగా బలపడింది. ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని ఇది కదులుతోంది. మంగళవారం ఉదయం మచిలీపట్నం-బాపట్ల మధ్య నిజాంపట్నానికి సమీపంలో ‘మిగ్‌జాం’ తీరం దాటనుంది. తీరాన్ని దాటే సమయంలో 110 కి.మీ. వేగంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. తీరం దాటేంత వరకూ కోస్తాంధ్ర తీరప్రాంతానికి సమాంతరంగా సముద్రంలో ‘మిగ్‌జాం’ కదలనుంది. ప్రస్తుతం గంటకు 10 కి.మీ. వేగంతో తుపాను కదులుతోంది.

తీరాన్ని దాటిన తర్వాత..

ప్రస్తుతం చెన్నైకి 90 కి.మీ., నెల్లూరుకు 120 కి.మీ., మచిలీపట్నం, బాపట్ల తీరాలకు 300 కి.మీ. దూరంలో ‘మిగ్‌జాం’ కేంద్రీకృతమైంది. నిజాంపట్నం వద్ద తీరాన్ని దాటిన తర్వాత తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడే అవకాశం ఉంది. తీరాన్ని దాటిన అనంతరం తెనాలి, విజయవాడ మీదుగా కదలనుంది. మంగళవారం అర్ధరాత్రికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయి. తీవ్ర తుపాను కోస్తాంధ్ర తీరానికి అత్యంత చేరువగా రావటంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు, గాలులతో తుపాను విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపింది.

తీరప్రాంతాల్లో అలజడి

ఇప్పటికే తిరుపతి, నెల్లూరు తీరప్రాంతాల్లో తీవ్రస్థాయిలో అలజడి నెలకొని భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని సూళ్లూరుపేట, ఒంగోలు, కొవ్వూరు, చీరాల, మచిలీపట్నం, అవనిగడ్డ, రేపల్లె మండలాల్లోని లోతట్టు ప్రాంతాలకు సముద్రపు నీరు చొచ్చుకువచ్చే అవకాశం ఉంది. తీవ్ర తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడనున్నట్లు పేర్కొంది.

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షపాతం

తీవ్ర తుపాను మిగ్‌జాం ప్రభావంతో గడచిన 24 గంటల్లో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. తిరుపతి పూలతోట వద్ద 30 సెం.మీ., తిరుపతి జిల్లా అల్లంపాడు వద్ద 26 సెం.మీ., నెల్లూరులో 25.4 సెం.మీ వర్షపాతం, నాయుడు పేటలో 24 సెం.మీ, నెల్లూరు గాంధీనగర్‌లో 22 సెం.మీ., కట్టువపల్లెలో 21 సెం.మీ., వెంకటాచలంలో 19.7 సెం.మీ., చిట్టేడులో 19 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని