MLC Kavitha: 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌.. తిహాడ్‌ జైలుకు కవిత

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను రౌజ్‌ అవెన్యూ కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు హాజరుపరిచారు.

Updated : 26 Mar 2024 14:37 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను రౌజ్‌ అవెన్యూ కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు హాజరుపరిచారు. ఈడీ తరఫు న్యాయవాది జోయబ్‌ హుస్సేన్‌ ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించారు. 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్‌ విడుదల అయ్యిందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కవితకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్‌ 9 వరకూ ఈ రిమాండ్‌ కొనసాగనుంది. దీంతో ఆమెను తిహాడ్‌ జైలుకు అధికారులు పంపనున్నారు. మరోవైపు కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 1న విచారణ చెపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.

కోర్టుకు హాజరుపరిచిన సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది తప్పుడు కేసు. మనీలాండరింగ్‌ కేసు కాదు.. పొలిటికల్‌ లాండరింగ్‌ కేసు. ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తా. నన్ను తాత్కాలికంగా జైలులో పెట్టవచ్చు. నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఇప్పటికే ఒక నిందితుడు భాజపాలో చేరాడు. మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్‌ ఇస్తోంది. మూడో నిందితుడు రూ.50 కోట్లు బాండ్ల రూపంలో భాజపాకు ఇచ్చాడు’’ అని పేర్కొన్నారు. జై తెలంగాణ.. జై కేసీఆర్‌ నినాదాలు చేస్తూ ఆమె కోర్టులోకి వెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని