Ramoji rao: ఆపద వస్తే కదిలేది.. కదిలించేది ఆయనే!

Ramoji rao: ప్రకృతి విపత్తులు సంభవించేటప్పుడు ఆదుకోవడంలో రామోజీరావు ముందుండేవారు. తనవంతుగా సాయం చేసేవారు. సాయపడమని దాతలకు పిలుపునిచ్చేవారు.

Published : 09 Jun 2024 00:47 IST

Ramoji rao | ప్రకృతి కన్నెర్ర చేసినా.. కరోనా మహమ్మారి విరుచుకుపడినా.. ఆపత్కాలంలో ముందడుగు వేసేవారు రామోజీరావు (Ramoji rao). నలుగురికీ చేయూతనివ్వండి అని పిలుపునివ్వడం కంటే ముందు.. ఆయనే స్వయంగా సాయానికి పూనుకొనేవారు. తాను చేయూతనందించి.. నలుగుర్నీ భాగస్వాముల్ని చేసేవారు. పేదరికంలో ఉన్న  చిన్నపిల్లల వైద్యం కోసం అయినా.. ప్రకృతి ప్రకోపంలో కొట్టుమిట్టాడుతున్న బాధితుల కోసమైనా.. ఆయన పిలుపునిచ్చిందే తడువుగా దాతలూ మేమున్నామంటూ చేతులు కలిపేవారు. వారిచ్చిన ప్రతి రూపాయినీ బాధ్యతగా చేర్చేవారు. అందుకే ఇప్పటికీ ‘ఈనాడు’లో ఏదోమూల కదిలించే చిన్న వార్త వచ్చినా దాతలు స్పందించి తమ వంతుగా సాయం చేస్తుంటారు.

అడుగుపడింది నాడే..

  • అది 1976 వ సంవత్సరం.. ఒకే ఏడాదిలో దివిసీమ ప్రాంతంలో వరుసగా 3 తుపాన్లు విరుచుకుపడ్డాయి. అప్పుడే తొలిసారిగా తుపాను సహాయనిధిని ప్రారంభించింది ఈనాడు. దానికి విశేష స్పందన లభించింది. పాఠకుల నుంచి దాదాపు రూ.65 వేలు విరాళాల రూపంలో రాగా.. సీఎం సహాయనిధికి అందించారు.
  • 1977 నవంబరులో కృష్ణా జిల్లా పాలకయతిప్ప గ్రామాన్ని వరదలు ముంచేశాయి. అప్పుడు రామకృష్ణమఠం ఆధ్వర్యంలో వరదలకు తట్టుకునేలా దాదాపు 112 పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చింది ఈనాడు. ఇళ్లు కట్టగా మిగిలిన డబ్బుతో పక్కనే కృష్ణాపురం అనే ఊళ్లో మరో 22 మందికి నీడ కల్పించారు.
  • 1996లో కోస్తాపై పెనుతుపాను విరుచుకుపడినప్పుడు మరోసారి బాధితులకు అండగా నిలిచింది. పాతిక లక్షలతో తుపాను సహాయనిధిని ప్రారంభించగా పాఠకుల విరాళాలతో అది కోటి రూపాయలకు చేరుకుంది. దీంతో 42 సూర్య భవనాలను తీరప్రాంతంలో పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడేలా అందించింది.
  • 2009 అక్టోబరులో కృష్ణ, తుంగభద్ర, కుందు నదులకు కనీవినీ ఎరుగనిరీతిలో వరదలు రావడంతో కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలు కకావికలమయ్యాయి. తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అండగా ఈనాడు తక్షణం రంగంలోకి దిగి 1.2 లక్షల ఆహార పొట్లాలను అందజేసింది. ఈనాడు గ్రూపు సంస్థల తరపున కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తూ.. బాధితులను ఆదుకోవాల్సిందిగా దాతలకు రామోజీరావు పిలుపునిచ్చారు. వేలమంది దాతలు విరాళాలు అందించడంతో రూ.6.05 కోట్లు సమకూరాయి. వీటితో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన చేనేత కుటుంబాలకు ఈనాడు మగ్గాలు అందజేసింది. కర్నూలు జిల్లాలో ఉషోదయ పేరిట ఆధునిక సౌకర్యాలతో 4 పాఠశాల భవనాలను నిర్మించి 2011 జులై 14న ప్రభుత్వానికి అప్పగించింది. వరద బాధితులను ఆదుకునేందుకు వేల మంది వితరణశీలురు రూ.కోట్లు విలువ చేసే వస్తువులు, ఇతర సామగ్రి పంపిణీ చేసేందుకు ‘ఈనాడు’ను ఆశ్రయించడం సంస్థపై ప్రజలకు ఉన్న విశ్వసనీయతకు నిదర్శనం.
  • 2014లో హుద్ హుద్ బాధితుల కోసం రూ.3 కోట్ల సహాయనిధితో పాటు పాఠకుల విరాళాలు రూ.3 కోట్లు కలిపి విశాఖ జిల్లాలోని తంతడి, వాడపాలెం ప్రాంతాల్లో 80 కొత్త ఇళ్లు నిర్మాణంతోపాటు దెబ్బతిన్న మరికొన్ని ఇళ్లకు మరమ్మతులు చేసి ఇచ్చింది ఈనాడు.
  • కరోనా మహమ్మారి విరుచుకుపడినప్పుడు రామోజీరావు రూ.20 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ సాయాన్ని రెండు రాష్ట్రాల సీఎం సహాయనిధి ఖాతాలకు బదిలీ చేశారు. అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ సంస్థ ఛైర్మన్ రామోజీరావు లేఖలు కూడా రాశారు. కరోనాపై యుద్ధంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
  • రామోజీ ఫౌండేషన్‌ తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకుంది. అందులో ఒకటి కృష్ణా జిల్లా పెదపారుపూడి కాగా.. రెండోది రంగారెడ్డి జిల్లా నాగన్‌పల్లి గ్రామం. ఈ రెండు గ్రామాల అభివృద్ధికి ఫౌండేషన్‌ ఎంతగానో కృషి చేసింది. కోట్లాది రూపాయలు ఆయా గ్రామాల అభివృద్ధికి వెచ్చించింది.

ఈనాడు కట్టించిన ఇళ్ల తాళాలను అందిస్తున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ 

 

పక్క రాష్ట్రాల్లోనూ..

  • 1999లో ఒడిశాను చెల్లాచెదురు చేసింది సూపర్ సైక్లోన్‌. అప్పుడు కూడా ముందుకువచ్చిన ఈనాడు పక్కా ఇళ్లను నిర్మించింది. జగత్‌సింగ్ పుర్ జిల్లాలో 50 లక్షలతో 60 పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చింది.
  • ఇక 2001లో గుజరాత్‌లో వేలమందిని బలిగొన్న భూకంపంలో తనవంతు సాయం అందించింది. సహాయనిధితో పాటు పాఠకుల విరాళాలను పోగు చేసి దాదాపు 2.2 కోట్ల రూపాయలతో కచ్ జిల్లాలో స్వామి నారాయణ్ సంస్థ సహకారంతో 104 ఇళ్లు సమకూర్చింది.
  • 2004లో దేశ దక్షిణ తీర ప్రాంతంలో సునామీ ముంచెత్తినప్పుడు తీవ్రంగా నష్టపోయిన కడలూరు, నాగ పట్టణం జిల్లాల్లో రెండున్నర కోట్లు వెచ్చించి రామకృష్ణ మఠం సహకారంతో మత్స్యకారులకు 164 ఇళ్లు అందించింది.
  • 2018 కేరళ వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా నిలిచేందుకు రామోజీ గ్రూపు సంస్థల తరఫున ఛైర్మన్‌ రామోజీరావు రూ.3 కోట్లతో ‘ఈనాడు’ సహాయనిధిని ఏర్పాటుచేశారు. మానవతావాదులూ ఇతోధికంగా సాయం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ పిలుపును అందుకున్న ప్రజలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు ఇలా ఎందరో సహృదయులు తమకు సాధ్యమైనంత మేరకు విరాళాలు అందించారు. వారి దాతృత్వ హృదయాన్ని సాక్షాత్కరిస్తూ నిధి రూ.7.77 కోట్లకు చేరింది. ఆ డబ్బుతో అలెప్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సర్వం కోల్పోయిన 121 కుటుంబాలకు ‘ఈనాడు’ ఆధ్వర్యంలో రెండు పడక గదుల ఇళ్లు కట్టించారు.

ప్రతీ రూపాయికీ లెక్క..

ప్రజలిచ్చే సొమ్ముకు కచ్చితమైన లెక్క ఉండాలి. లేదంటే వారు నమ్మకంతో చేసే సాయానికి విలువ ఉండదు. అందుకే ఏ రోజుకారోజు సహాయనిధికి ఎవరెవరు ఎంతిచ్చారన్నది పత్రికాముఖంగానే ప్రచురించింది.. ఈనాడు. ఆ నిధులతో ఏం చేయాలి..? ఎలా ఖర్చు చేస్తే బాగుంటుంది? అన్నది బాధిత ప్రాంత అధికారులతో, నాయకులతో చర్చించాకే నిర్ణయం తీసుకునేది. నిర్మాణాలు పూర్తయి, లబ్ధిదారులకు అందజేసి, నిర్వహణ బాధ్యతను స్థానిక        గ్రామ పంచాయతీలకు అప్పజెప్పే వరకూ ఈనాడు పాత్ర ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు