Viveka Murder Case: ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ వ్యవహారం.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. గంగిరెడ్డి విడుదలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది.  

Updated : 26 May 2023 15:16 IST

దిల్లీ: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. గంగిరెడ్డి విడుదల అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది.  బెయిల్‌ మంజూరు చేయడంతో పాటు కస్టడీ తర్వాత విడుదల తేదీని ఖరారు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ పీఎస్‌ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.  

నేపథ్యమిదీ..

హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ఇటీవల జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన వేసవి సెలవుల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) సంజయ్‌ జైన్‌ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ఎ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేసి లొంగిపోవాలని చెబుతూనే.. ఆయన్ను జులై 1న విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు ఏప్రిల్‌ 27న జారీ చేసిన ఉత్తర్వులు 8వ వింతను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటిది తామెప్పుడూ వినలేదన్నారు. సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను తాము సమర్థిస్తున్నామని చెప్పారు. 

దీనిపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేస్తామని.. తదుపరి విచారణను శుక్రవారానికి  వాయిదా వేయాలని కోరారు. గంగిరెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదిస్తూ తాము కూడా బెయిల్‌ రద్దును సవాలు చేస్తూ ఒక ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశామన్నారు. అది ఇంకా లిస్ట్‌ కావాల్సి ఉన్నందున దాన్ని కూడా కలిపి విచారించాలని కోరారు. దాంతో జస్టిస్‌ నరసింహ రెండు కేసులనూ శుక్రవారానికి వాయిదా వేశారు. తాజాగా ఆ కేసును విచారించిన ధర్మాసనం.. గంగిరెడ్డి విడుదల అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని