Avanigadda: అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం

కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్‌ బాబు నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. 

Published : 24 Apr 2024 17:52 IST

అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్‌ బాబు నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. బాణసంచా నిప్పురవ్వలు పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధమైంది. అయితే, ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగిందా? లేక కక్షపూరితంగా చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

అవనిగడ్డ ప్రధాన రహదారికి సమీపంలో తెదేపా కార్యకర్త యాసం వెంకటేశ్వరరావు, అతని పెదనాన్న కుటుంబసభ్యులు కలిసి ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. ఆ ఇల్లు ప్రభుత్వ స్థలంలో ఉందని, గత రెండేళ్లుగా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వైకాపా నాయకుల ప్రోద్భలంతో గ్రామపంచాయితీ, రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ స్థలంలో ఉన్న మరుగుదొడ్లు తొలగించారు. దీంతో వెంకటేశ్వరరావు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా స్థలం స్వాధీనం చేసుకునేందుకు రెండు సార్లు ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలో బుధవారం వైకాపా ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌ బాబు నామినేషన్‌ ర్యాలీ సందర్భంగా వైకాపా శ్రేణులు కాల్చిన బాణసంచా ఆ ఇంటిపై పడి పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఉన్న రూ.2లక్షల విలువైన గ్రానైట్‌, టైల్స్‌, ఏడు తులాల బంగారం, రెండు కుటుంబాలకు చెందిన ఫర్నిచర్‌ పూర్తిగా కాలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని