TSPSC: గ్రూప్-2 పరీక్ష మళ్లీ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..
తెలంగాణలో గ్రూప్-2 (TSPSC Group 2) పరీక్ష మళ్లీ వాయిదా పడింది. ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసిన అధికారులు కొత్త తేదీలను ఖరారు చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 (TSPSC Group 2) పరీక్ష మళ్లీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 2, 3న గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను రీషెడ్యూల్ చేశారు. TSPSC Group 2 Examను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో గ్రూప్-2 పరీక్ష వాయిదా, కొత్త తేదీల ఖరారుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే.
తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే, అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్ -2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు. వారి నుంచి వచ్చిన డిమాండ్లను పరిశీలనలోకి తీసుకున్న ప్రభుత్వం గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసింది. నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వేళ తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వాయిదా వేయాలని నిర్ణయించినట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.