Karnataka: ఆసుపత్రిలో రీల్స్‌.. 38 మంది వైద్య విద్యార్థులపై చర్యలు

కొందరు విద్యార్థులు ఆసుపత్రిలో రీల్స్‌ చేయడంతో యాజమాన్యం వారిపై చర్యలు తీసుకొంది. కర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకొంది.

Updated : 11 Feb 2024 10:53 IST

బెంగళూరు: ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. కొంతమంది పాపులారిటీ, వినోదం కోసం తాము ఎక్కడ ఉన్నామో మరచిపోయి.. సెల్ఫీలు, వీడియోలతో హల్‌చల్‌ చేస్తుంటారు. తాజాగా వైద్య విద్యార్థులు కొందరు ఏకంగా ఆసుపత్రిలోనే రీల్స్‌ చేశారు. ఈ ఘటన కర్ణాటక (Karnataka)లో చోటు చేసుకొంది.

ఆసుపత్రి యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. గడగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (GIMS)లో చదువుతున్న 38 మంది విద్యార్థుల ట్రైనింగ్‌ మరో 20 రోజుల్లో ముగియనుంది. త్వరలో కళాశాలలో జరగనున్న ప్రీ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమం కోసం ఎలాంటి అనుమతి లేకుండా ఆసుపత్రిలోనే రీల్స్‌ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో.. విద్యార్థుల చర్యపై జీఐఎమ్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆపరేషన్‌ గదిలో ప్రీవెడ్డింగ్‌ షూట్‌.. వైద్యుడి సస్పెండ్‌

‘‘ఆసుపత్రిలో రీల్స్‌ చేసేందుకు యాజమాన్యం విద్యార్థులకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. వాటిని మేము ప్రోత్సహించం. వారు ఏం చేయాలనుకున్నా రోగులకు ఇబ్బంది కలగకుండా.. ఆసుపత్రి వెలుపల చేయాలి. నిబంధనలు ఉల్లంఘించి ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. వారికి జరిమానాతో పాటు.. ట్రైనింగ్‌ను మరో 10 రోజులు పొడిగించాం’’ అని డైరెక్టర్ డాక్టర్‌ బసవరాజ్‌ పేర్కొన్నారు.  ఇటీవల చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో ఓ వైద్యుడు ఆపరేషన్‌ గదిలో తన ప్రీవెడ్డింగ్‌ షూట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుడిని తక్షణమే సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని