
లంగ్స్పై కరోనా ప్రభావం..శాస్త్రవేత్తల డీ-కోడ్..!
బోస్టన్: కరోనా వైరస్ సోకిన తర్వాత శరీరంలో వివిధ అవయవాలపై ఆ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అయితే, కరోనా వైరస్ ఊపరితిత్తులను ఎలా నష్టపరుస్తోందన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. దీనిపై పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలు, ఊపిరితిత్తుల కణాలను ఈ కరోనా వైరస్ ఎలా దెబ్బతీస్తోందన్న విషయాన్ని డీకోడ్ చేయగలిగారు. దీంతో కరోనా వైరస్ను ఎదుర్కొనే చికిత్సను రూపొందించడంలో తాజా పరిణామం దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయనం మాలిక్యులార్ సెల్ జర్నల్లో ప్రచురితమైంది.
కరోనాకు కారణమైన సార్స్-కోవ్-2 వైరస్ ఊపిరితిత్తుల్లో ఏ విధంగా నష్టాన్ని చేకూరుస్తుందని తెలుసుకునేందుకు అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (బీయూఎస్ఎం) శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. ఇందుకోసం స్పెక్ట్రోమెట్రీ సాంకేతిక సాయంతో ఊపిరితిత్తుల్లోని కణాల శాంపిళ్లలోని అణువులను వర్గీకరించి విశ్లేషించారు. సార్స్-కోవ్-2 వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తుల్లోని కణాలు, ప్రోటీన్ల మార్గంలో మార్పులు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఫాస్ఫోరైలేషన్ అని పిలిచే కీలక ప్రోటీన్ మార్పును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దేహంలోని కణాల్లో ప్రోటీన్ పనితీరును నియంత్రించడంలో ఈ ఫాస్ఫోరైలేషన్ ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది.
అయితే, కరోనా వైరస్ సోకినప్పుడు ఊపిరితిత్తుల కణాలను గందరగోళ పరచడం, ప్రోటీన్లలోని పనితీరులో మార్పులకు కారణమవుతుంది. ఈ మార్పులు ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్ కణాలు రెట్టింపు కావడానికి కారణమవడంతో పాటు భారీ స్థాయిలో అక్కడి కణాలను నష్టపరుస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా సాధారణంగా కణాల పెరుగుదలకు కావాల్సిన వనరులను వినియోగించుకొని కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. ఇలా కరోనా వైరస్ కణాలు మరికొన్ని కణాలకు సోకుతూ తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. పరిశోధనల్లో భాగంగా వైరస్ సోకని, వైరస్ నిర్ధారణ ఐన వ్యక్తుల ఊపరితిత్తులను పనితీరును పరిశీలించారు. వైరస్ నిర్ధారణ అయిన 24గంటల తర్వాత ఊపిరితిత్తుల కణాల్లో జరిగే మార్పులను నిశితంగా గమనించారు. తద్వారా వైరస్ సోకిన వారిలో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
ఊపిరితిత్తుల నష్టాన్ని నివారించడంలో తాజా పరిశోధన ఫలితాలు ఎంతో దోహదపడుతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వ్యాధి నిర్ధారణ, నూతన చికిత్సా విధానాన్ని కనుగోవడంతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న 18రకాల ఔషధాలు కొవిడ్ చికిత్సలో వినియోగించుకునే వీలుంటుందని సూచించారు.
ఇవీ చదవండి..
అమెరికాలో టీకా పంపిణీ మొదలు.. కానీ
భారత్లో జనవరిలో వ్యాక్సినేషన్!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.