Sanjay Singh: దిల్లీ మద్యం కేసు.. ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌కు బెయిల్‌

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌కు (Sanjay Singh) సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Updated : 02 Apr 2024 15:54 IST

దిల్లీ: దిల్లీ మద్యం పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్‌ వ్యవహారంలో ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు వరుసగా అరెస్టవుతున్న తరుణంలో.. ఆ పార్టీకి కాస్త ఊరట కలిగింది. ఈ వ్యవహారంలో ఆరు నెలల క్రితం అరెస్టయిన ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌కు (Sanjay Singh) సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ట్రయల్‌ కోర్టు విధించిన షరతులకు లోబడి నడుచుకోవాలని ఆయన్ని ఆదేశించింది. మరోవైపు రాజకీయ కార్యకలాపాల్లోనూ పాల్గొనేందుకు అనుమతిచ్చింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తున్న తరుణంలో జైలు నుంచి ఆయన విడుదలవడం పార్టీకి కాస్త సాంత్వన చేకూర్చే అంశమే.

ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోడాతో సంజయ్‌సింగ్‌కు పరిచయాలు ఉన్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు..  సంజయ్‌సింగ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించి, అక్టోబర్‌ 4న ఆయన్ని అరెస్టు చేశారు. ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం తిహాడ్‌ జైలుకు తరలించారు. ఈ కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీమంత్రి సత్యేంద్ర జైన్‌, పార్టీ కీలకనేత విజయ్‌నాయర్‌ ఈ జైలులోనే రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే.

జైలు నుంచి వెళ్లి ప్రమాణస్వీకారం

రిమాండ్‌ ఖైదీగా ఉంటూనే సంజయ్‌సింగ్‌ ఇటీవల మరోసారి ఎంపీగా ప్రమాణం చేశారు. ఆయన రాజ్యసభ పదవీకాలం జనవరి 27తో ముగిసింది. ఈ క్రమంలోనే సంజయ్‌ని ఆమ్‌ఆద్మీ పార్టీ రెండోసారి ఎంపీగా నామినేట్‌ చేసింది. దీంతో దిల్లీ కోర్టు ఆదేశాల మేరకు మార్చి 19న ఆయన్ని ప్రత్యేక భద్రత నడుమ జైలు అధికారులు పార్లమెంట్‌కు తీసుకెళ్లారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే మళ్లీ జైలుకు తరలించారు.

సత్యమేవ జయతే: ఆతిశీ

ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దిల్లీ మంత్రి ఆతిశీ స్వాగతించారు.  ‘సత్యమేవ జయతే’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌, జస్టిస్‌ వరాలే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సంజయ్‌సింగ్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. సంజయ్‌కు బెయిల్‌ ఇవ్వడంపై ఈడీ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని