Adani Group: అదానీ గ్రూప్‌నకు కేదార్‌నాథ్‌ రోప్‌వే కాంట్రాక్ట్‌

Eenadu icon
By National News Team Published : 15 Sep 2025 22:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Adani group | దిల్లీ: సోన్‌ప్రయాగ్‌-కేదార్‌నాథ్ మధ్య రోప్‌వే నిర్మించేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ మేరకు కంపెనీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సోన్‌ప్రయాగ్‌, కేదార్‌నాథ్‌ మధ్య సుమారు 12.9 కిలోమీటర్ల పొడవు రోప్‌ వే నిర్మాణానికి ఈ ఏడాది మార్చిలో కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.4,081 కోట్లు అవుతుందని అంచనా వేసింది.

జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్‌ ఒకటి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 3,583 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏటా ఆరు నుంచి ఏడు నెలలపాటు మాత్రమే ఆలయం తెరిచి ఉంచుతారు. ఆ కాలంలోనే సుమారు 20 లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారు. కేదార్‌నాథ్‌ వెళ్లేందుకు సోన్‌ప్రయాగ్ వరకు రహదారి మార్గం ఉంది. అక్కడి నుంచి కేదార్‌నాథ్‌ ఆలయానికి చేరుకోవాలంటే యాత్రికులు 16 కి.మీ పైకి ఎక్కాల్సి వస్తోంది. ఈ ప్రయాణం కాలినడకన, మోసేవాళ్లు, గుర్రాలపై లేదా హెలికాప్టర్‌ ద్వారా మాత్రమే సాధ్యమవుతోంది.

రోప్‌వే అందుబాటులోకి వస్తే 36 నిమిషాల్లోనే ప్రయాణం పూర్తవుతుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రోడ్స్‌, మెట్రో, రైలు, వాటర్‌ (RMRW) డివిజన్‌ ఈ ప్రాజెక్ట్‌ చేపట్టనుంది. ఈ రోప్‌వే ద్వారా గంటకు ఒకవైపు 1,800 మంది యాత్రికులను తరలించొచ్చు. తద్వారా రోజుకు 18 వేల మందికి దర్శనభాగ్యం కల్పించొచ్చు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి ఆరేళ్లు పడుతుందని కంపెనీ పేర్కొంది. కేదార్‌నాథ్‌ రోప్‌వే కేవలం ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదని, భక్తి, ఆధునిక మౌలిక సదుపాయాల మధ్య వారధి అని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్‌ అదానీ అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఉత్తరాఖండ్‌ ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి, పర్యాటక అభివృద్ధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు