Atishi: త్వరలో మేం నలుగురం జైలుకు.. ఆతిశీ సంచలన వ్యాఖ్యలు

కొద్దిరోజుల్లో మరికొందరు ఆప్‌ నేతలు అరెస్టు కావొచ్చని దిల్లీ మంత్రి ఆతిశీ(Atishi) వెల్లడించారు. ఆ పేర్లను కూడా ఆమె బయటపెట్టారు. 

Updated : 02 Apr 2024 12:58 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆప్‌ (AAP) నేతలు అరెస్టవుతారని దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. వారిలో తాను కూడా ఉంటానని పేర్కొన్న ఆమె.. మిగతా ముగ్గురు సౌరభ్‌ భరద్వాజ్‌, దుర్గేశ్‌ పాథక్‌, రాఘవ్‌ చద్దా అని వెల్లడించారు.

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఈడీ విచారణలో కీలక విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. నిందితుడైన విజయ్‌ నాయర్‌ (Vijay Nair) తన మంత్రి వర్గంలోని ఆతిశీ, సౌరభ్‌కు రిపోర్టు చేసేవాడని సీఎం పేర్కొన్నట్లు ఏఎస్‌జీ ఎస్‌వీ రాజు కోర్టుకు వెల్లడించారు. తమ పేర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో ఆమె తాజాగా మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు.

టీ, రొట్టె ముక్కలతో రోజు మొదలు

‘‘నిన్న కోర్టులో ఈడీ.. సౌరభ్‌, నా పేరు ప్రస్తావించింది. ఈ స్టేట్‌మెంట్‌ సీబీఐ, ఈడీ వద్ద ఎప్పటి నుంచో ఉంది. కానీ, దానిని ఇప్పుడు బయటపెట్టడానికి కారణం.. కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోదియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ అరెస్టు తర్వాత కూడా ఆప్‌ ఐక్యంగా ఉందని భాజపా భావించడమే. దాంతో వారి తర్వాత వరుసలో ఉన్న నేతలను జైలులో పెట్టేందుకు యత్నిస్తోంది. నా రాజకీయ జీవితాన్ని కాపాడుకోవడానికి తమ పార్టీలో చేరాలని ఒక వ్యక్తి ద్వారా భాజపా నన్ను సంప్రదించింది. లేకపోతే ఈడీ అరెస్టు చేస్తుందని ఆ వ్యక్తి ద్వారా చెప్పించింది’’ అని ఆరోపించారు.  

కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా..? 

మద్యం కేసు విచారణలో భాగంగా కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను తిహాడ్‌ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారా..? అంటూ అడిగిన ప్రశ్నకు ఆతిశీ బదులిచ్చారు. అందుకు ఎలాంటి కారణం లేదన్నారు. ‘‘ఈ అంశానికి సంబంధించి రెండు ప్రొవిజన్స్ ఉన్నాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండేళ్లకు పైగా శిక్ష పడితే.. ప్రజా ప్రతినిధిగా ఉండేందుకు వీలు ఉండదు. కానీ కేజ్రీవాల్‌ దోషిగా తేలలేదు. ఆయనకు దిల్లీ అసెంబ్లీలో భారీ మెజార్టీ ఉంది. అందుకే ఆయన రాజీనామా చేయడానికి ఎలాంటి కారణం లేదు’’ అని తెలిపారు. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే.. ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడం భాజపాకు మరింత సులభం అవుతుందని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని