DGCA: వీల్‌ఛైర్‌ లేక వృద్ధుడి మృతి ఘటన.. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా!

వీల్‌ఛైర్‌ సదుపాయం (Wheelchair) కల్పించకపోవడంతో ఓ వృద్ధుడు అనారోగ్యానికి గురై మరణించిన ఘటనలో ఎయిరిండియాకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) రూ.30లక్షల జరిమానా విధించింది.

Updated : 29 Feb 2024 15:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీల్‌ఛైర్‌ సదుపాయం కల్పించకపోవడంతో ఓ వృద్ధుడు నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయిన ఘటన ముంబయి విమానాశ్రయంలో (Mumbai Airport) ఇటీవల చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA).. ఎయిరిండియాపై చర్యలు తీసుకుంది. విమాన సేవల్లో అలసత్వం వహించినందుకు రూ.30 లక్షల జరిమానా విధించింది.

అమెరికా నుంచి ఎయిరిండియా (Air India) విమానంలో భారత్‌కు వచ్చిన వృద్ధ దంపతులు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విమానాశ్రయంలో ఫిబ్రవరి 12న దిగారు. సిబ్బంది వీల్‌ఛైర్‌ సదుపాయం కల్పించకపోవడంతో ఆ వృద్ధుడు (80) విమానం నుంచి టెర్మినల్‌ వరకు నడుచుకుంటూ వెళ్లాడు. ఇమిగ్రేషన్‌ విభాగం వద్దకు చేరుకున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.  వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఎయిరిండియాకు డీజీసీఏ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఎయిరిండియా వివరణ ఇచ్చింది.

సందేశ్‌ఖాలీలో అకృత్యాలు.. ఎవరీ షాజహాన్‌ షేక్‌..?

ప్రయాణికుడి భార్యకు వీల్‌ఛైర్‌ సమకూర్చామని ఎయిరిండియా పేర్కొంది. వీల్‌ఛైర్లకు భారీ డిమాండు ఉన్నందున మరొకటి సమకూర్చేవరకు కొద్దిసేపు వేచి ఉండాలని వారిని విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. బాధితుడు మాత్రం తన భార్యతో కలిసి టెర్మినల్‌ వరకు నడుచుకుంటూ వచ్చాడని.. ఇమిగ్రేషన్‌ తనిఖీ కోసం వేచి చూస్తుండగా తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వివరించింది. ఎయిరిండియా స్పందనను పరిశీలించిన డీజీసీఏ.. వీల్‌ఛైర్‌ సమకూర్చడంలో విమానయాన సంస్థ అలసత్వం వహించిందని తేల్చింది. ఇందుకు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈసందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తగిన సంఖ్యలో వీల్‌ఛైర్లను అందుబాటులో ఉంచుకోవాలని అన్ని విమానయాన సంస్థలకు డీజీసీఏ అడ్వైజరీ జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని