Arvind Kejriwal: మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్‌ సవాల్‌

ఆప్‌ నేతలు ఒక్కొక్కరిగా అరెస్టుకు గురి కావడంతో కేంద్రంలోని భాజపాపై దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో భాజపా ప్రధాన కార్యాలయానికి చేరుకుంటానని.. వీలైనంతమందిని అరెస్టు చేసుకోమంటూ సవాల్‌ విసిరారు. 

Updated : 18 May 2024 20:50 IST

దిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ (Swati Maliwal)పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ (Kejriwal PA Bibhav Kumar) దాడికి పాల్పడిన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో బిభవ్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై కేజ్రీవాల్‌ స్పందించారు. పార్టీ నేతలతో భాజపా ప్రధాన కార్యాలయానికి చేరుకుంటానని.. వీలైతే అందరినీ అరెస్టు చేసుకోవాలంటూ  సవాల్‌ చేశారు.

‘‘ప్రధాని మోదీ జీ.. మీరు ఆప్‌ నేతలైన మనీశ్‌ సిసోదియా, సంజయ్‌సింగ్‌, నాతో సహా ఒక్కొక్కరినీ కారాగారానికి పంపిస్తూ గేమ్‌ ఆడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు నేను నా పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరితో కలిసి భాజపా ప్రధాన కార్యాలయానికి వస్తా. ఎవరెవరిని జైల్లో పెట్టాలనుకుంటున్నారో ఒకేసారి పెట్టేయండి. నేతల్ని జైల్లో పెట్టడం ద్వారా పార్టీని అణిచివేయాలను మీరు అనుకుంటున్నారు. ఇలాంటి చర్యలతో పార్టీ విచ్ఛిన్నం కాదు.. కావాలంటే ప్రయత్నించండి’’ అన్నారు.

మాలీవాల్‌ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్‌ నివాసం నుంచి మరో వీడియో

మేం చేసిన తప్పేంటి..?

‘‘ఇంతకీ ఆప్‌ ఏం తప్పు చేసింది?పేదలకు నాణ్యమైన విద్య, మొహల్లా క్లినిక్‌లను అందించడమే అది చేసిన తప్పా? మంచి పనులకు అడ్డుకట్ట వేసేందుకే భాజపా తీవ్రంగా యత్నిస్తోంది. మా నేతలందరినీ జైల్లో పెట్టి ఆప్‌ను నాశనం చేయాలని చూస్తోంది. అది ఎన్నటికీ జరగదు. ఆప్‌ ప్రజల గుండెల్లో ఉంది’’ అని కేజ్రీవాల్‌ దుయ్యబట్టారు.

డ్రామాలు ఆపండి: భాజపా

దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై భాజపా స్పందించింది. ‘‘సొంత పార్టీ మహిళా నేతపై జరిగిన దాడిపై కేజ్రీవాల్‌ మౌనం వహిస్తున్నారు. మీరు చేస్తున్న డ్రామాలు ఇక ఆపండి. ఆమెపై దాడి జరిగి రోజులు గడుస్తున్నా ఇంకా ఎందుకు పెదవివిప్పడం లేదు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు?’’ అని భాజపా చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవా ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు