Atiq Ahmed: అతీక్ కార్యాలయంలో రక్తపు మరకలు..!

యూపీ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్(Gangster Atiq Ahmed) కార్యాలయంలో పోలీసులకు రక్తపు మరకలు, కత్తి కనిపించింది. ఈ తాజా ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. 

Published : 24 Apr 2023 21:32 IST

 

ప్రయాగ్‌రాజ్‌: కొద్దిరోజుల క్రితం గ్యాంగ్‌స్టర్ అతీక్‌ అహ్మద్(Gangster Atiq Ahmed), అతడి సోదరుడి హత్య ఉత్తర్‌ప్రదేశ్‌( Uttar Pradesh)లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా పాక్షికంగా కూల్చివేసిన గ్యాంగ్‌స్టర్ కార్యాలయంలో పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. మెట్ల దగ్గర రక్తం చిమ్మినట్లు ఉందని యూపీ పోలీసులు వెల్లడించారు. సోఫాలో తెల్లటి వస్త్రం, ఆ దగ్గర్లోనే ఒక కత్తి ఉన్నట్లుచెప్పారు. ప్రయాగ్‌రాజ్‌లోని చకియాలో ఉన్న కార్యాలయంలో ఇవి కనిపించినట్లు తెలిపారు. అయితే ఆ రక్తం ఆనవాళ్లు ఎవరివో తెలియాల్సి ఉందని చెప్పారు. దీనిపై దర్యాప్తు జరుపుతామని, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అతీక్‌ భార్య కోసం డ్రోన్లతో వేట.. ఎవరీ షాయిస్తా పర్వీన్‌..! 

ఇటీవల యూపీలో వరుస కాల్పుల ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మొదట గ్యాంగ్‌స్టర్ అతీక్(Gangster Atiq Ahmed) కుమారుడు అసద్‌, అతడి సన్నిహితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఏప్రిల్ 13న ఈ ఘటన జరిగింది. దీనిపై ఇద్దరు సభ్యులతో కూడిన జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిటీని వేసింది. ఆ వెంటనే ఏప్రిల్ 15న అతీక్, అతడి సోదరుడు.. జర్నలిస్టులుగా వచ్చిన ముగ్గురు వ్యక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. మృతులను వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని