Center: ‘కావాలనే వివాదం సృష్టిస్తున్నారు’: ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సమర్థించుకున్న కేంద్రం

ఎన్నికల సంఘం(ఈసీ)లో ఖాళీ అయిన రెండు కమిషనర్‌ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు(Supreme Court)లో కేంద్రం అఫిడవిట్‌ సమర్పించింది.  

Published : 20 Mar 2024 18:31 IST

దిల్లీ: పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్బీర్‌ సింగ్‌ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపికయిన సంగతి తెలిసిందే. వీరి నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం(Center) సమర్థించుకుంది. ఈ అంశంపై పిటీషనర్లు కావాలనే వివాదం సృష్టిస్తున్నారని విమర్శించింది. ఈమేరకు సుప్రీంకోర్టు(Supreme Court)లో అఫిడవిట్ దాఖలు చేసింది.

ఈ ఇద్దరు మాజీ ఐఏఎస్‌ల పేర్లకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ ఇటీవల ఆమోదం తెలిపింది. దీనికి ముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌చౌధరి సభ్యులుగా ఉన్న కమిటీ సమావేశమైంది. అనంతరం ఇద్దరు కొత్త కమిషనర్ల నియామకంపై కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ ఈనెల 8న రాజీనామా చేయడం, మరో కమిషనర్‌ అనూప్‌చంద్ర పాండే కాలపరిమితి ఫిబ్రవరి 14న ముగియడంతో ఎన్నికల సంఘంలో ఏర్పడిన రెండు ఖాళీలను కేంద్ర ప్రభుత్వం వీరిద్దరితో భర్తీ చేసింది.

ఎన్నికల వేళ ‘ఉచిత హామీలు’.. విచారణకు అంగీకరించిన సుప్రీం

ఎన్నికల సంఘం(ఈసీ)లో ఖాళీ అయిన రెండు కమిషనర్‌ పోస్టుల భర్తీ ఎంపిక కమిటీలో సీజేఐను మినహాయించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. కొత్త కమిషనర్ల నియామకాన్ని ‘ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం-2023’ ప్రకారం చేపట్టకుండా కేంద్రాన్ని అడ్డుకోవాలని పిటీషనర్లు కోరారు. అయితే వారి నియామకాన్ని తాత్కాలికంగా నిలిపేసేందుకు ఇటీవల సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఈక్రమంలోనే పిటీషనర్లను ఉద్దేశించి కేంద్రం స్పందించింది. ఆ ఇద్దరు కమిషనర్ల యోగ్యత, అర్హతపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదని ఈసందర్భంగా ప్రస్తావించింది. ఎలాంటి ఆధారాలు లేని ప్రకటనల ద్వారా వివాదం సృష్టించాలని చూస్తున్నారని విమర్శించింది. తమ అభ్యంతరాలను సమర్పించడంలో వారు విఫలమయ్యారని వెల్లడించింది. దీని ఆధారంగా వాటిని కొట్టివేయాలని కోర్టును కోరింది. ఈ అంశంపై గురువారం(మార్చి 21)న విచారణ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని