DK Shivakumar: ‘అప్పుడు సిద్ధరామయ్య భయపడ్డారు’.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

గతంలో ఓ విషయంలో సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) భయపడ్డారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar) వ్యాఖ్యలు చేశారు. దీంతో వారిద్దరి బంధంపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.

Published : 28 Jun 2023 13:57 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)ను ఉద్దేశించి ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో సిద్ధూ సీఎంగా ఉన్న సమయంలో ఓ ప్రాజెక్ట్‌ గురించి ఆయన భయపడ్డారని వ్యాఖ్యానించారు. దీంతో ఇది కాస్తా రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారడమే గాక.. సిద్ధూ - డీకే బంధం బీటలు వారుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అసలేం జరిగిందంటే..

బెంగళూరు నగర నిర్మాత కెంపేగౌడ జయంతి సందర్భంగా మంగళవారం విధానసౌధ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో డీకే శివకుమార్‌ ప్రసంగించారు. ‘‘టన్నెల్స్‌, ఫ్లైఓవర్లు నిర్మించాలని చాలా మంది నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. అయితే అలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి చాలా సవాళ్లు ఎదురవుతాయి. 2017లో ఇలాగే బెంగళూరులో స్టీల్ ప్లైఓవర్‌ నిర్మించాలని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తలపెట్టింది. అయితే దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. అప్పటి సీఎం సిద్ధరామయ్య, బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కేజే జార్జ్‌ ఆందోళనలకు భయపడ్డారు. అదే నేనైతే.. అలాంటి నిరసనలకు తలొగ్గేవాణ్ని కాదు. ప్రాజెక్టు నిర్మాణానికే ముందుకెళ్లేవాణ్ని’’ అని డీకే వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ (Congress) అధికారంలోకి వచ్చిన నెల రోజులకే డీకే నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం.. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపింది. సిద్ధూతో డీకేకు పొసగడం లేదంటూ వదంతులు గుప్పుమన్నాయి. అయితే, శివకుమార్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి ప్రియాంక్‌ ఖర్గే స్పందించారు. ‘‘సిద్ధరామయ్య భయపడ్డారని నేను చెప్పను. ప్రజల అభిప్రాయాలతో సీఎం సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్ని సార్లు తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చి మంచి నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యమవుతుంటుంది. ఉపముఖ్యమంత్రి ఆ ఉద్దేశంతోనే చెప్పారేమో’’ అని అన్నారు.

ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) కాంగ్రెస్‌ విజయం తర్వాత ముఖ్యమంత్రి పదవికి సిద్ధూ, డీకే మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. చివరకు డీకే హైకమాండ్‌ నిర్ణయానికి తలొగ్గి సీఎం రేసు నుంచి వైదొలిగారు. దీంతో సిద్ధరామయ్య రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత నుంచి వీరిద్దరూ ఐక్యంగానే ప్రభుత్వాన్ని నడుపుతున్నా.. ప్రతిపక్ష భాజపా మాత్రం వీరిపై విమర్శలు చేస్తూనే ఉంది. ఈ ప్రభుత్వం ఎంతోకాలం నిలవదని కాషాయ నేతలు జోస్యం చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు