Flight: భార్యాభర్తల గొడవతో.. విమానం దారి మళ్లింది..!

లుఫ్తాన్సా విమానం(Plane)లో ఓ జంట అభ్యంతరకరంగా ప్రవర్తించి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది. వారి వల్ల బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం దిల్లీలో దిగాల్సి వచ్చింది. 

Published : 29 Nov 2023 15:12 IST

దిల్లీ: స్విట్జర్లాండ్‌ నుంచి బ్యాంకాక్‌ బయలుదేరిన లుఫ్తాన్సా విమానాన్ని(Lufthansa flight) బుధవారం ఉదయం దారిమళ్లించారు. దాంతో అది దిల్లీ(Delhi)లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఇద్దరు ప్రయాణికుల అభ్యంతరకర ప్రవర్తనే ఈ  పరిస్థితికి దారితీసిందని సమాచారం. మీడియా కథనాల ప్రకారం..

‘భార్యభర్తల మధ్య గొడవ కారణంగా విమానాన్ని దారి మళ్లించారు. అయితే వారి గొడవకు కారణం మాత్రం తెలియరాలేదు’ అని విమానాశ్రయ సిబ్బందిని ఉటంకిస్తూ మీడియా కథనాలు వెల్లడించాయి. మొదట తన భర్త(జర్మన్‌) ప్రవర్తన గురించి భార్య(థాయ్‌లాండ్) పైలట్‌కు ఫిర్యాదు చేసింది. భర్త తనను బెదిరిస్తున్నాడని, సిబ్బంది జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ గొడవ గురించి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు వెల్లడించిన పైలట్లు.. దిల్లీలో ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ల్యాండింగ్ అనంతరం వారిని విమానం నుంచి దింపేశారు. టెర్మినల్ ఏరియా వద్ద వారితో అధికారులు మాట్లాడారని తెలుస్తోంది. ఆ తర్వాత కొద్దిసేపటికే విమానం టేకాఫ్ అయింది.

ముందే చెప్పా.. ఆ 41 మంది బయటకు వస్తారని..!: ఆర్నాల్డ్‌ డిక్స్‌

ఇదిలా ఉంటే.. మొదట ఆ విమానం పాకిస్థాన్‌లో దిగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నం అమలుకాలేదు. ఇటీవల కాలంలో విమానంలోని సిబ్బంది, తోటి ప్రయాణికులతో కొందరు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఈజిప్టు నుంచి దిల్లీ బయల్దేరిన విమానంలోని సీట్లను ఒక ప్రయాణికుడు ధ్వంసం చేశాడు. అంతేగాకుండా తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించాడు. విమానం దిల్లీలో దిగిన తర్వాత అతడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని