Arvind Kejriwal: అనారోగ్యమైతే.. ప్రచారం ఎలా చేశారు?: కేజ్రీవాల్‌ బెయిల్‌ అభ్యర్థనను వ్యతిరేకించిన ఈడీ

దిల్లీ సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేసిన బెయిల్ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. ఆయన మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

Published : 30 May 2024 16:23 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) గురువారం రెగ్యులర్ బెయిల్ కోసం దిల్లీ కోర్టును ఆశ్రయించారు. అలాగే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలంటూ మరో పిటిషన్ వేశారు. వీటిపై జరిగిన వాదనల్లో భాగంగా.. ఆయన అభ్యర్థనలను ఈడీ వ్యతిరేకించింది. ఎన్నికల వేళ విస్తృత ప్రచారం నిర్వహించకుండా ఆయన ఆరోగ్యమేమీ అడ్డంకిగా మారలేదని వెల్లడించింది.

మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరుచేసింది. జూన్‌ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్‌ ఇటీవల సుప్రీంను ఆశ్రయించారు. జూన్‌ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పేర్కొన్నారు.

కేరళ రాజకీయాల్లో మళ్లీ స్మగ్లింగ్‌ కలకలం.. అరకేజీ బంగారంతో చిక్కిన శశిథరూర్‌ పీఏ

అయితే ఆ పిటిషన్ లిస్టింగ్‌కు బుధవారం సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని, అందుకే ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని వెల్లడించింది. దాంతో తాజాగా ఆయన దిల్లీ కోర్టుకు వెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్‌ విషయంలో ఈ శనివారంకల్లా స్పందన తెలియజేయాలని ఈడీని ఆదేశించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని