Prajwal Revanna: భారత్‌ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!

దేవెగౌడ కంచుకోట అయిన హసన్‌ ఎంపీ సెగ్మెంట్‌ బరిలో ఉన్న ఆయన మనవడు రేవణ్ణ ప్రస్తుతం విదేశాలకు వెళ్లారు. ఆయనపై అసభ్యకర వీడియోలు ప్రచారంలోకి వచ్చిన వేళ ఈ పరిణామం చోటు చేసుకొంది.  

Updated : 28 Apr 2024 15:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో జనతాదళ్‌ (సెక్యులర్‌) అగ్రనేత దేవెగౌడ (Deve Gowda) మనవడు, ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna) భారత్‌ వీడారు. ఆయన ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయల్దేరి వెళ్లారు. మరో వైపు కర్ణాటక ప్రభుత్వం ఈ వీడియోలపై దర్యాప్తు కోసం స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. 

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా హసన్‌ జిల్లాలో ఇవి ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు. 

రేవణ్ణ పేరు చెడగొట్టగానికి నవీన్‌ గౌడ మరికొందరు కలిసి ఈ క్లిప్‌లను వ్యాప్తి చేశారని జేడీఎస్‌-భాజపా ఎలక్షన్‌ ఏజెంట్‌ పూర్ణచంద్ర గౌడ ఇప్పటికే ఫిర్యాదు చేశాడు. ఆ మార్ఫ్‌డ్‌ వీడియోను హసన్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నవీన్‌ మరికొందరు ఓటర్లకు పంపించారన్నాడు. అంతేకాదు.. రేవణ్ణకు ఓటేయద్దని వారు కోరినట్లు పేర్కొన్నాడు. మరోవైపు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు.

హసన్‌ నియోజకవర్గం దేవెగౌడ కుటుంబానికి కంచుకోట లాంటిది. రాజకీయంగా పుట్టస్వామి కుటుంబంపై వీరిదే ఆధిపత్యం. 1994, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి హొళెనరసిపుర శాసనసభ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ.. దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్‌.డి.రేవణ్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి కోడలు ఎస్‌.జి.అనుపమకూ ఓటమి తప్పలేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి మనవడు శ్రేయస్‌ పటేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయగా.. 3,152 ఓట్ల తేడాతో రేవణ్ణ చేతిలో ఓడిపోయారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇరు కుటుంబాలకు చెందిన వారే మళ్లీ పోటీపడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని