Cabinet Meet: డ్వాక్రా మహిళలకు డ్రోన్లు.. మరో ఐదేళ్లు ఉచిత రేషన్‌: కేబినెట్ కీలక నిర్ణయాలు

Cabinet Meet: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్వాక్రా మహిళలకు డ్రోన్లను ఇచ్చే పథకంతో పాటు.. ఉచిత రేషన్‌ పొడిగింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Updated : 29 Nov 2023 15:49 IST

దిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ప్రయోజాలను విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 15 వేల మహిళా ‘స్వయం సహాయక బృందాల’కు డ్రోన్లను (Drones to SHGs) అందించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు.

2024-25 ఆర్థిక సంవత్సరంతో మొదలుకొని 2025-26 వరకు డ్రోన్ల అందజేతను కొనసాగించనున్నట్లు అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. దీనికోసం రూ. 1,261 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ డ్రోన్ల ద్వారా ‘స్వయం సహాయక బృందాలు (SHGs)’ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ ఆధారిత సేవలు అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఫలితంగా ఒక్కో బృందం ఏటా రూ.లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాలకు డ్రోన్‌ టెక్నాలజీని అందించనున్నట్లు ఆగస్టు 15న ఎర్రకోటపై చేసిన ప్రసంగంలో మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

తొలుత భయపడ్డాం.. కానీ, నమ్మకాన్ని వీడలేదు: మోదీతో కార్మికుల సంభాషణ

ఉచిత రేషన్‌ పొడిగింపు..

కొవిడ్‌ మహమ్మారితో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఉచిత రేషన్‌ (Free Ration) పథకం మరికొన్నేళ్లు కొనసాగనుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే దాదాపు 80కోట్ల మంది ప్రజలకు మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్‌ అందించాలని  కేబినెట్‌ నిర్ణయించింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని 2024 జనవరి 1 నుంచి మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.

 ఈ ఏడాది డిసెంబరు 31తో ఈ పథకం ముగియనుండగా.. దీన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తామని ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర కేబినెట్‌ దీనికి ఆమోదం తెలిపింది.

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో అనేక మంది ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడం కోసం కేంద్రం 2020 ఏప్రిల్‌లో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అప్పటి నుంచి దీన్ని పలుమార్లు పొడిగిస్తూ వస్తున్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి నెలకు 5 కిలోల చొప్పున ప్రతి నెలా ఉచిత రేషన్ అందిస్తోన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని