Kejriwal vs ED: ‘నేరస్థులను అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిందే’.. ఈడీ-కేజ్రీవాల్‌ హోరాహోరీ వాదనలు

‘నేరం చేస్తాం, ఎన్నికల కారణంగా మమ్మల్ని అరెస్టు చేయొద్దు’ అని చెప్పే హక్కు విచారణ ఖైదీలకు లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పేర్కొంది.

Updated : 03 Apr 2024 22:34 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్టును సవాలు చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ (Arvind kejriwal) దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు బుధవారం విచారించింది. ఈ సందర్భంగా ఇరుపక్షాలు హోరాహోరీ వాదనలు వినిపించాయి. ఎన్నికల వేళ అరెస్టు చేయడాన్ని పిటిషనర్‌ ప్రధానంగా ప్రస్తావించగా.. మనీలాండరింగ్‌ జరిగినట్లు ప్రాథమికంగా తేలిందని, దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందని ఈడీ వాదించింది. తమపై వస్తోన్న ఆరోపణలను ఖండించిన కేంద్ర దర్యాప్తు సంస్థ (ED).. నేరస్థులను అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిందేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.

ఎన్నికల సమయంలో ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందని, కేవలం తమను అవమానించడమే వారి లక్ష్యమని అరవింద్‌ కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదించారు. ఎన్నికల వేళ తనను నిరోధించడమే వారి ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సరైన ఆధారాలు లేకుండానే ఈడీ అరెస్టు చేసిందన్నారు.

జైలులో కేజ్రీవాల్‌కు నిద్రలేని రాత్రి

ఎన్నికల వేళ అరెస్టు చేశారంటూ పిటిషనర్‌ చేస్తున్న వాదనలను ఈడీ బలంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ASG) ఎస్‌వీ రాజు వాదనలు వినిపిస్తూ.. నేరస్థులను అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిందేనన్నారు. ‘నేరం చేస్తాం, ఎన్నికల కారణంగా మమ్మల్ని అరెస్టు చేయొద్దు’ అని చెప్పే హక్కు విచారణ ఖైదీలకు లేదన్నారు. ఇటువంటి వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఏఎస్‌జీ పేర్కొన్నారు.  నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్లు తమవద్ద ఆధారాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించి వాట్సాప్‌ చాట్‌లు, హవాలా ఆపరేటర్ల స్టేట్‌మెంట్‌లు ఉన్నాయన్నారు.

ఇరుపక్షాల వాదనలు విన్న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ.. తీర్పును గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఇదిలాఉంటే, మార్చి 21న అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రస్తుతం తిహాడ్‌ జైలు నంబర్‌2లో ఉన్న సంగతి తెలిసిందే. 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న ఆయనకు న్యాయస్థానం ఏప్రిల్‌ 15 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు