Manipur: మణిపుర్‌లో ఆగని హింస.. అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడి దుండగుల కాల్పులు

Fresh Violence In Manipur: మణిపుర్‌లో మిలిటెంట్లు జరిపిన దాడిలో ముగ్గురు మృతిచెందారు. దీంతో మరోసారి హింస చెలరేగింది. భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.

Updated : 05 Aug 2023 15:03 IST

ఇంఫాల్‌: జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతోన్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బిష్ణుపుర్‌ జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి మళ్లీ హింస ( Violence) చెలరేగింది.

మృతిచెందిన వారు క్వాక్టా ప్రాంతంలోని మైతేయి వర్గానికి చెందిన వారని తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి వీరు తమ ఇళ్లకు కాపాలా కాస్తుండగా గుర్తుతెలియని దుండగులు వీరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తండ్రీకుమారుడితో పాటు మరో వ్యక్తి మరణించారు. నిందితులను మిలిటెంట్లుగా అనుమానిస్తున్నారు. కేంద్ర భద్రతా దళాల బఫర్‌జోన్‌ను దాటుకుని దుండగులు గ్రామంలోకి చొరబడి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ ఘటనతో క్వాక్టాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ ఘటన జరిగిన కాసేపటికే ఈ ప్రాంతంలో కుకీ వర్గానికి చెందిన ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో భీకర కాల్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆయుధాగారం లూటీ.. 19 వేల రౌండ్ల తూటాలను దోచుకెళ్లిన అల్లరి మూక

క్వాక్టా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని అధికారిక వర్గాల సమాచారం. ఈ కాల్పుల్లో మణిపుర్‌ కమాండో ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. అటు పారామిలిటరీ బలగాలు భారీగా మోహరించాయి. ప్రస్తుతం బిష్ణుపుర్‌లో పరిస్థితులు క్లిష్టంగానే ఉన్నాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదే బిష్ణుపుర్‌లో గురువారం రాత్రి అల్లరిమూకలు రెచ్చిపోయి ఆయుధాలను లూటీ చేసిన విషయం తెలిసిందే. నారన్సీనా ప్రాంతంలో రెండో బారత రిజర్వు బెటాలియన్‌ (ఐఆర్‌బీ) ప్రధాన కార్యాలయంలోని పోలీసు ఆయుధాగారంపై దాడి చేసి భారీగా ఆయుధ సామగ్రిని ఎత్తుకెళ్లారు. అంతకుముందు రెండు రోజుల క్రితం భద్రతాబలగాలు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని 17 మంది గాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు