Cheetah Deaths: చీతాల మరణానికి రేడియో కాలరే కారణమా?

‘ప్రాజెక్ట్‌ చీతా’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటిగా ప్రాణాలు కోల్పోతున్నాయి.

Updated : 19 Jul 2023 08:43 IST

భోపాల్‌: ‘ప్రాజెక్ట్‌ చీతా’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటిగా ప్రాణాలు కోల్పోతున్నాయి. రెండు విడతల్లో నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను తీసుకురాగా ఇప్పటి వరకు 8 మృతి చెందాయి. చీతాలు మృత్యుఒడికి చేరడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక పోవడం వల్లే అవి మృతి చెందుతున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ  కొన్ని ప్రసార మాధ్యమాల్లో మాత్రం వాటికి అమర్చిన రేడియో కాలర్‌ వల్లే ప్రాణాలు కోల్పోతున్నాయని వార్తలొస్తున్నాయి. వాటికి మరింత ఊతమిచ్చేలా తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో వదలిన పవన్‌ (ఒబన్‌) అనే చిరుత తాజాగా అస్వస్థతకు గురైంది. దానిని ఎన్‌క్లోజర్‌లోకి తీసుకొచ్చిన అధికారులు ప్రత్యేక వైద్య బృందంతో పరీక్షలు చేశారు. చీతా కదలికలను పసిగట్టేందుకు దాని మెడకు అమర్చిన రేడియో కాలర్‌ కింద గాయాలైనట్లు గుర్తించారు. వాటిలో చిన్నపాటి పురుగులు కూడా ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే కాలర్‌ ఐడీ ట్యాగ్‌ను తొలగించి చికిత్స నిర్వహించారు. మరో రెండు చీతాలకు కూడా ఇదే రకంగా గాయాలైనట్లు గుర్తించారు. ప్రస్తుతం నలుగురు సభ్యుల బృందం కునో నేషనల్‌ పార్కులో ఉంటూ చీతాల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. తాజా ఘటన నేపథ్యంలో గ్వాలియర్‌, భోపాల్‌ నుంచి మరో నలుగురు వైద్యుల బృందాన్ని కేంద్రం కునో నేషనల్‌ పార్కుకు పంపింది. అన్ని చీతాలను తిరిగి ఎన్‌క్లోజర్లలోకి తీసుకొచ్చి పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తిరిగి విడిచిపెట్టనున్నారు. ఇకపై వాటి కదలికలను పసిగట్టేందుకు రేడియో కాలర్‌ బదులు డ్రోన్‌లను ఉపయోగించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని